Sunday, July 25, 2010

సద్గురువు-2


ఇదంతా ఎందుకు చెప్పానంటే , అంతటి మహాత్ములకే , తపస్వులకే అంతర్ముఖులై నిశ్చలం గా అదే నిష్ట లో ఉండటం సాధ్యపడలేదు. కాసేపు తెరిపి కోసం బయటికొస్తే ఆ కాసేపటి లోనే బోల్తా కొట్టి పోయినవాడే వున్నాడు. తపస్సు భగ్నమైనవాళ్ళూ వున్నారు. అది అంతటి కష్టమైన పని. అది ఋషీశ్వరులకే సాధ్యపడలేదంటే ఇంక మనం ఎంత జాగ్రత్తగా వుండాలో తెలుసుకోవాలి.
ఉదాహరణకు ఒక రోజు ఒక భక్తురాలు బాబా వద్దకు వచ్చి బాబా ను తన ఇంటికి భోజనానికి రమ్మంది. “ అలాగే తల్లీ! తప్పకుండా వస్తాను. భోజనం కూడా చేస్తాను. కానీ నేను వస్తే మాత్రం ఛీ కొట్టి తరిమేయకు సుమా! “ అని అన్నారు బాబా. బాబా! “ నేను మిమ్మల్ని అలా యెందుకు చేస్తాను? మీరు తప్పక రావాలి" అని ప్రార్ధించి ఆమె ఇంటికి వెళ్ళింది. బాబా కు ఆతిథ్యమివ్వడానికి వంటకాలను సిద్ధం చేసి బాబా కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. భోజన సమయం దాటి పోతున్నా బాబా మాత్రం రాలేదు. కానీ ఒక కుక్క వచ్చి బాబా కోసం వండి వడ్డించడానికి సిధ్ధంగా వున్న వంటకాలను ముట్టుకోబోయింది. అది చూచిన ఆమె పొయ్యి లో వున్న కట్టెను తీసి ఆ కుక్క పైకి విసిరింది. ఆ కుక్క తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆమె చాలా సేపు బాబా కోసం వేచి చూచింది గాని బాబా రాలేదు. తర్వాత ఎంతో బాధగా మసీదు కి వెళ్ళి బాబా తన ఇంటికి భిక్షకు రానందుకు నిష్టూరమాడింది. అప్పుడు బాబా ఆమెతో, “ నేను వస్తే మండుతున్న కట్టే నాపై విసిరావు గదమ్మా! నువ్వే నన్ను గుర్తు పట్టలేదు. సర్వ జీవుల రూపాలలో నేనే వున్నానని గుర్తుంచుకో" అని చెప్పారు.

అలాగే హంసరాజ్ అనేవాడు చాలా కాలం గా ఉబ్బశవ్యాధితో బాధపడుతుండేవాడు. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపోయేసరికి బాబా దగ్గరకు వచ్చి శిరిడి లోనే కొంతకాలమున్నాడు. అతనిని బాబా పుల్లపెరుగు తినవద్దన్నారు. కానీ అతడికి పుల్ల పెరుగంటే చాలా ఇష్టం.అందుకని బాబా తినవద్దన్నా కూడా భార్య చేత బలవంతాన తోడు పెట్టించుకొని తినేవాడు. కానీ సర్వజ్నుడైన బాబా కు తెలియనిదేమున్నది? బాబా చిత్రమైన లీల చేశారు. ప్రతి రోజూ ఆ దంపతులు మసీదులో మధ్యాహ్న హారతి కి హాజరయ్యేవారు.వారు అక్కడికి వచ్చిన సమయం లో ప్రతి రోజూ వీళ్ళ రూమ్ లోకి ఒక పిల్లి వచ్చి పెరుగు తినిపోయేది. మొదటి రోజలా జరిగేసరికి పొరపాటు అనుకొని అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అదేమీ చిత్రమో వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ పిల్లి రావటం, పెరుగు తినిపోవడం ప్రతి రోజూ జరుగుతూనే వుంది. చివరకు అతనికి విసుగు పుట్టి కోపం వచ్చి హారతి కి గూడ పోకుండా దాన్నెలాగైనా రాకుండా చూడాలని, వస్తే కొట్టాలని నిర్ణయించుకొని ఒక కర్ర చేత్తో పట్టుకొని కాపలా కూర్చున్నాడు. సరిగా సమయానికి ఆ పిల్లి రానే వచ్చింది. “ రోజూ పెరుగు తిని పోతావా?” అని అతడు దానిని కర్రతో కొట్టాడు. తర్వాత అతడు మసీదు కి రాగానే బాబా అన్నారు: “ ఇక్కడొక పనికిమాలిన వాడు ఉబ్బసం తో బాధపడుతున్నాడు. వాడిని పుల్లపెరుగు తినవద్దని చెప్పాను. ఎంత చెప్పినా వినకుండా అతడు తింటూనే వుంటే నేనే పిల్లి రూపం లో వెళ్ళి తిని అతడా పెరుగు తినకుండా చూస్తున్నాను. చివరకు వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు" అన్నారు.
అలాగే బల్వంత్ నాచ్నే అన్నగారు బొంబాయి లో శస్త్ర చికిత్స కానీ ఆస్పత్రి లో వున్న సమయం లో వాళ్ళింటికి ఒక సాధువు వచ్చి భిక్ష అడిగాడు. అతని వాడిన గారు అన్నం పెట్టింది. ఇంట్లో బెండకాయ కూర వుంది గానీ అది అందరూ టీనాగా మిగిలినది కదా! అని ఆయనకు వెయ్యలేదు. వేరే కూర వేసింది. కానీ ఆ సాధువు ఆ కూరే అడిగి వేయించుకొని మరీ తిన్నాడు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అతడు శిరిడీ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు బాబా ఆ సాధువు తామేనని అతనికి తెలిపారు.

ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా ఏ సాధువు కి పెట్టినా తనకే చెందుతుందని, ఏ ప్రాణీని ఆదరించినా , హింసించినా తనకే చెందుతుందనీ నిరూపించారు బాబా.

ఏ దైవానికైనా మొక్కుకొని ఆ మ్రొక్కు ఎగ్గొడితే వాళ్ళు రాగానే వాళ్ళు మ్రొక్కుకున్నంత డబ్బూ అడిగి పుచ్చుకునేవారు. అలాగని ప్రక్కవాడు డబ్బులిస్తే తీసుకునేవారు కాదు.” ఏమయ్యా! వాడిస్తే తీసుకొంటివి, వీడిస్తే తీసుకోలేదేమని అడిగితే " వాడు మ్రొక్కుకొని ఎగ్గొడితే అడిగి తీసుకున్నాను. వీడు మ్రొక్కుకోలేదు గనుక వీడి దగ్గర తీసుకోలేదు. “ అనేవారు. కాబట్టి ఏ దేవతకార్పించినా తనకే చెందిందని, చివరకు మానవమాతృణ్ణి గూడ ఏ విధంగా చూచుకున్నా గూడ అది ఆయనకే చెందిందని భక్తులకు అసంఖ్యాకంగా అటువంటి అనుభూతులను ఇస్తూనే వచ్చారు.అంతటా అన్నీ రూపాలలో వ్యాపించి వుంటాయి. కారణం అన్నీ రూపాలలో ఆయనే వున్నారు గనుక.

ఉదాహరణకు చంద్రాబాయి బొర్కర్ అను భక్తురాలు శిరిడీ కొంతకాలమున్నారు. అప్పుడామే భర్త పండరిపురం లో వున్నాడు. ఒకరోజు బాబా ఆమెతో పండరిపురం లోని ఆమె భర్త వద్దకు వెళ్ళమని చెప్పారు.ఆమె వెంబడే తానుంటానని గూడ చెప్పారు.కానీ ఆమె అక్కడకు వెళ్ళేసరికి ఆయనక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో గూడ తెలియలేదు. ఏమీ చేయాలో తోచని పరిస్థితులలో ఆమె వుండగా, ఒక ఫకీర్ ఆమె వద్దకు వచ్చి మీ వారు ధోండ్ స్టేషన్ లో వున్నారు. వెంటనే వెళ్ళమని చెప్పి టికెట్టు గూడ ఇచ్చారు. అంతేగాక ఆమె భర్తకు గూడ కలలో ఒక ఫకీర్ కనిపించి నీ భార్య ఫలానా రైలు లో వస్తున్నదని చెప్పారు. తర్వాత ఆ ఫకీర్ సాయిబాబానేనని వాళ్ళు తెలుసుకున్నారు.

బాబా ఆదేశం ప్రకారం ఖాండోబా ఆలయం లో వున్న ఉపాసనీ బాబా, బాబా కు నైవేద్యమిచ్చిన తరువాత తను భోజనం చేసేవారు. ఒకరోజు ఉపాసనీ ఆ నైవేద్యాన్ని తీసుకొని పోతూ వున్నప్పుడు ఒక నల్ల కుక్క తోకాడిస్తూ వెంటబడింది. దీనికి పెట్టిన తర్వాత బాబాకు నైవేద్యం పెట్టడం ఎట్లాగా అని దానిని ఛీ కొడుతూ , కసిరి కొడుతూ మసీదు కి వెళ్లారు. వీరు మసీదు కి వెళ్ళి బాబాకు నైవేద్యం ఇవ్వబోతే , “ ఇక్కడికెందుకు తీసుకు వచ్చావు? నేనక్కడ నల్ల కుక్క రూపం లో వున్నాను గదా!” అన్నారు బాబా. కాబట్టి ఇక నుంది గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిద్దామని అనుకొన్నాడు. అంతగా ప్రయత్నించినప్పటికీ, అంత జాగ్రత్తగావుంటున్నప్పటికీ మరలా ఏమారడతను.ఒక రోజు ఇతను వంట చేసుకుంటుంటే బిచ్చమెత్తుకునే వాడొకడు ఆశగానిలబడి దాని వైపు చూస్తున్నాడు. కాబట్టి అది అపవిత్రమౌతుందని తలచి అతనిని కసిరి కొట్టాడు. నైవేద్యం మసీదు కి తీసుకెళ్ళగానే మరలా బాబా కోప్పడ్డారు. “ ఇప్పటి నుండి గుర్తు పెట్టుకో. ఎక్కడ నీ దృష్టి పడుతుందో, అక్కడ నేనున్నా" నని చెప్పారు బాబా. ఈ విధంగా సకల చరాచర విశ్వమంతా తమ రూపమేనని నిరూపించిన శ్రీ సాయిబాబా సమర్థ సద్గురువు.

Saturday, July 24, 2010

సద్గురువు-1

సద్గురువు అన్న పదానికి సరైన నిర్వచనంచెపుతూ , ఎవరు సరైన సద్గురువో గుర్తు పట్టి ఆయనను అనుసరించి ఆయన చూపిన మార్గంలో ఎలా నడవాలో అలతి అలతి వాక్యాలతో, అనల్ప అర్థాలతో అరటిపండు చేతిలో వొలిచి పెట్టినట్లు చెప్పిన ఈ వ్యాసం గురువు గురించి, ఆధ్యాత్మికత ను గురించి తెలుసుకోవాలనుకునేవారికి సరైన దిశానిర్దేశం చేస్తుంది. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన “ సాయి మాస్టర్ ప్రవచనములు” గ్రంథం నుండి అద్భుతమైన ఈ వ్యాసం గురుపూర్ణిమ సందర్భంగా ......


సద్గురువు-1

గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం నచాన్యోస్థి, తస్మై శ్రీ గురవే నమః


గురువే విశ్వం. గురువుకన్యంగా మరొకటి లేదు. అంటే గురువు సకల దేవతా స్వరూపి. బాగా అవగాహన చేసుకుంటూ పోయేవారికి ఈ చరాచర విశ్వమంతా గురువు యొక్క స్వరూపమే. అంతకు భిన్నంగా మరొకటి లేదు. ఈ శ్లోకం వల్ల తెలిసేదేమిటంటే --- ఈ చరాచర విశ్వమంతా తమ రూపమేనని ఎవరైతే నిరూపణ ఇవ్వగలరో వారే నిజమైన, సిసలైన, సంపూర్ణమైన గురువుఅని.


ఉదాహరణకు శ్రీకృష్ణుడు జగద్గురువు గా, యోగీశ్వరుడిగా, గీతాచార్యుడిగా లోకం లో ఇంతటి కీర్తి గడించడానికి కారణం భగవద్గీతోపదేశం కాదు. ఎందుకంటే అదే భగవద్గీతను అనేకసార్లు చదివినటువంటి మామూలు వ్యక్తి గూడా శ్రీకృష్ణుడు చెప్పినంత గొప్పగానూ ఉపన్యాసం ఇవ్వగలడు. కానీ, మామూలు వ్యక్తి చేయలేని పని ఒకటుంది అదే విశ్వరూప సందర్శనం. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూప సందర్శనం కలిగించాడు. తాను చెప్పిందంతా నిజమని నిరూపించాడు. ఆ పని మామూలు వ్యక్తి ఎలా చేయగలడు? తాను చెప్పినది నిజమని అర్జునుడికి అనుభవపూర్వకంగా నిదర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సృష్టి అంతా తన రూపమేనని చెప్పాడు. అప్పటి దాకా శ్రీకృష్ణుడు ఎంతగా చెప్పినా, “ ఏమిటబ్బా! ఇట్లా చెప్పాడీయన’ అని అర్జునుడికి అనిపిస్తుంది. కానీ, విశ్వరూప సందర్శనమయ్యేసరికి అర్జునునికి అప్పటివరకు తాను చెప్పిన విషయాలు మొత్తం ( అంటే విశ్వరూప సందర్శనం ఇచ్చేటప్పటికి ఎన్ని అధ్యాయాలు గీతా లో వున్నాయో అన్నీ) సమన్వయమై, అనుభవమై, దర్శనమయ్యాయి. అదే కృష్ణుని యొక్క గొప్పతనం. అందువలననే ఆ విషయం లో శ్రీకృష్ణునికి సాటి ఎవరూ లేరు. మరలా అదే విషయం అంత సంపూర్ణం గానూ పామరులైన మానవులకు గూడా ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకం గా నిరూపించినవారు శ్రీ శిరిడీ సాయి నాథుడు.


ఎంతో మంది మహాత్ములు వచ్చారు, పోయారు. ఇందులో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అన్నది ప్రశ్న కాదు. కానీ మనకు అనుభవపూర్వకం గా నిరూపించడం వల్ల మార్గం సులభమవుతుంది.మన మనస్సు తేలిక అవుతుంది. ఏ మహాత్ముడైనా, శ్రీకృష్ణుడైనా, ఏ దైవమైనా చెప్పేది ఒక్కటే, “ క్షణకాలమైనా విడవకుండా ఎల్లప్పుడూ మనసులో నన్నే చింతన చేస్తూ వుండండి. గుర్తు పెట్టుకోండి. మీ క్షేమ సమాచారాలన్నీ నేను కనిపెడుతుంటాను,” అనే. భక్తుల యోగ క్షేమములు వహిస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదే సాయి గూడ చెప్పారు. ఎంత మంది మహనీయులు వచ్చారో, అంతమందీ ఇదే మాట చెప్పారు.

ఎంత మంది చెప్పినా ఒకటి మాత్రం మన వల్ల కాదు. అదేమిటంటే అంతా ఆయన రూపమేనని అనుకోవడం. కుక్క కుక్కగా కనపడుతుంటే, మనిషి మనిషిగా కనపడుతుంటే, వీళ్లంతా ఆయన రూపమేనని అనుకోవడం ఎట్లా? ప్రక్క వారి మీద మనకు ఆగ్రహం వస్తుంది, అనుగ్రహం వస్తుంది. కోపం, అసూయ, ద్వేషం, భయం మొదలైనవన్నీ వస్తూంటాయి. కానీ, ఇవన్నీ కల్గించేటటువంటి మానవాకృతులన్నీ పరమేశ్వరుని రూపమని అనుకోవడమెట్లా?
ఇంట్లో నిశ్చలంగా కూర్చొని భగవంతుని కోసం ధ్యానం చేస్తూ వుంటే ఎంతో ప్రయత్నం మీద ఆ ధ్యాన మందిరం లో కూర్చోన్నంత సేపు భగవంతుడి మీద మనస్సు నిలిస్తే నిలిచి యుండు గాక. కానీ ఎల్లప్పుడూ నిలవదు.


ఉదాహరణకు ఒకడు ఆ ప్రయత్నం చేస్తూ వుంటే ( అంతా భగవత్స్వరూపమేనని ) ఇంట్లోని పిల్లవాడు వచ్చి విపరీతం గా అల్లరి చేశాడనుకోండి.వాడి మీద కోపం వచ్చి వాడిని చావబాదాడనుకోండి.అప్పుడు ఏమయిందన్న మాట?అంతకు ముందు వరకు తను చేసే ధ్యానం లో అతడు ఈ ప్రపంచంలో వున్న నామరూపాలన్నీ నీవేనయ్యా! అని నమస్కారం చేసుకొన్నాడు. వెంటనే ఆ పిల్లవాడిని పట్టుకొని చావబాదాడు. అప్పుడు ఎవర్ని పట్టుకొని చావబాదినట్లు?ఒక వేళ బాధకపోయినా , తీవ్రమైన ఆగ్రహం వచ్చి, ‘ ఈ ఇల్లు నరకంరా! ‘ అన్నాడనుకోండి. అప్పుడు ఏమయింది? ఏ పరాత్పరుడు తన చుట్టూ ఉన్నాడో, అన్నీ రూపాలలో ఉన్నదో అదే వీడికి నరకమయింది. అంటే జగత్తు రూపం లో బ్రహ్మం ఉంది. “ సర్వం ఖల్విదం బ్రహ్మ” కానీ మనస్సులో నరకమే ఉన్నదని అర్థం. చూడగలిగే వాళ్ళకు అదే భగవత్స్వరూపం.చూడలేని వారికి అదే మామూలు గృహం. చికాకులో ఉండేవారికి అదే నరకం. మన దృష్టిని బట్టే అంతా వుంది. కాబట్టి మన దృష్టి మారాలి.

పూజా గృహాలలో నుంచి ఇవతలకు రాగానే నిత్య జీవితం లో అవతల వారి పనుల వల్ల, మాటల వల్ల రాగద్వేషాలు ప్రకోపిస్తాయి. అందుకని మనం గుర్తుపెట్టుకోవడం కోసం మనం చేసే ప్రయత్నం వెంటనే ఎగిరిపోతుంది.వాడిట్లా చేశాడు, వీడిట్లా అన్నాడు అని, ఇదే జాబితా చదువుతుంది మనస్సు. మనం ఇక దైవాన్ని గుర్తుపెట్టుకొనేది ఎక్కడ?కనుక ఇది మానవజాతికి అంత సులభం కాదు. అంత తేలికగా రాదు. ఇది మామూలు మానవులకే గాదు. గొప్ప గొప్ప ఋషీశ్వరులకు గూడ చాలా కష్టమయిన విషయం.ఆ ఋషీశ్వరులు మామూలు కార్యక్రమాలన్నింటినీ మానుకొని అరణ్యాలలో వుంటూ ఘోర తపస్సు చేసుకుంటూ అంతర్ముఖులై వుంటారు. ఎంతో ధ్యాన నిష్టతో , తపస్సుతో పైకి వచ్చిన మహనీయులు కూడా ఏ కారణం చేతనైనా ఆ తపస్సు లోంచి లేచి ఇవతలకు వచ్చిన క్షణాల్లో వారి మనస్సు చంచలమవుతున్నది. ప్రక్కకే పోతున్నది. ఒకరికి కామం వల్ల కావచ్చు, మరొకరికి మరొక కారణం కావచ్చు.ఆయా పనుల ద్వారా వారి తపస్సు వ్యర్థమయిపోయి మరలా తపస్సు చేసుకోవడమనే కర్మ పట్టడం మన పురాణాలలో చెప్పబడ్డది. ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకొంటున్నాడు. ఎవరో ఏదో చేశారు, వారికి ఆగ్రహం వచ్చింది. “ ఒరేయ్ నీవీట్లా అయిపో!” అని శాపం పెట్టాడు. ఆ శాపం రూపం లో, ఆగ్రహ రూపం లో వాడికి పతనం వస్తుంది. అప్పుడు అవతలివాడికి కూడా కొద్దో గోప్పో సామర్ధ్యం వుంటే వాడి తపస్సుతో వాడూ శాపం పెట్టాడు. అప్పుడు ఏమయిందన్నమాట? వాడి శాపం తీరేదాక వీడా శాపఫలాన్ని అనుభవించవలసిందే. అప్పుడు ఇంతకు ముందు చేసిన తపస్సంతా వ్యర్థమయిపోయినట్లే గదా!
(సశేషం)

Friday, July 23, 2010

పరమ గురు చరణ సన్నిధి-వివేకం

(కొనసాగింపు)

ఇట్లా నిశ్చయించిన వెనుకను, సదసత్తులలో అనేక భేదాలు వున్నాయని మరువవద్దు. సరి ఇది అని, తప్పు ఇది అని, ముఖ్యమీది అని, అముఖ్యమిది ని, ఉపయోగకరమిది అని, వ్యర్ధమిది అని, సత్యమిది అని, అనృత మిది అని, స్వప్రయోజనమిది అని, పరోపకారమిది అని వివేకం తో తెలుసుకొనుట ఇంకా మిగిలే వుంటుంది.

తప్పును విడిచి సరియైన దానిని అవలంబించటం కష్టం గా తోచరాదు. ఎందుకంటే పరమ గురువును అనుసరించుగోరు వారు ఎన్ని కష్టాలైనా పడి, సరి అయిన దానినే అవలంబించాలని ముందే నిశ్చయం చేసుకొని వుంటారు.

అయినా ఈ శరీరం వేరు, నీవు వేరు. నీ ఇచ్చ ఎల్లప్పుడూ నీ శరీరం కోరు దానిని అనుసరించి వుండదు.

ఈ శరీరం ఏదైనా కోరినచో అది యథార్థంగా నీవు కోరునది అగునా అని నిలిచి యోచింపుము. నీవీశ్వరుడివే. ఈశ్వరుడిచ్చయించునదియే నీవును నిచ్చాయింతువు, గాని నీవు నీ యంతరంగమును లోతున దిగి శోధించి నీలో నుండు ఈశ్వరుని కనుగొని ( ఒకానొక ధీరుడు అమృతత్వమును కోరినవాడై దృష్టిని లోపలకు త్రిప్పి ప్రత్యగాత్మ ను ( లోపల నుండు ఆత్మను ) చూచును ---కఠోపనిషత్తు) వాని మాటను తెలిసికొనవలయును సుమా! అది నీ మాట.

నీ శరీరములే నీవను పొరపాటుపడకు.స్థూల శరీరం నీవు కావు. కామమయ శరీరం నీవు కావు.( ఈ కామమయ, మనోమయ శరీరములు రెండూ చేరి మనోమయ కోశమని వేదాంతులు చెప్తారు) మనోమయ శరీరం నీవు కావు. ఇవి ఒకొక్కటి తనకు కావలసిన దానిని పొండటానికి తానే ఆత్మ అని నటించును. అయినా వానినన్నింటిని తెలుసుకొని వానికన్నింటికి స్వామి నీవని యెరుగుము. (ఈ శరీరమునకు క్షేత్రమని పేరు. దీనిని తెలుసుకొనువాడు క్షేత్రజ్నుడు (జీవుడు) అని తెలిసినవారు చెప్పుదురు ---గీతా)

చేయవలసిన పని యుండగా శరీరం శ్రమ తీర్చుకోవాలి గాని, తిరుగబోవాలని గాని , భోజనపానములు చేయాలని గాని కోరును. తెలియని వాడు,' ఇవి అన్నీ నేను గోరేదను, నేను వీనిని చేయాలి ' అనుకుంటాడు. తెలిసినవాడు ' వీనిని కోరునది నేను కాదు. ఇది కొంత కాలమట్లుండనిమ్ము' ఏనును. ఎవరికైనా సహాయం చేయుటకు అవకాశం కలిగినప్పుడు శరీరం ' అది నాకెంతో శ్రమ, మరియెవరైనా చేయుదురు గాక' అని పలుమార్లు తలంచినను ' మంచిపని చేయటానికి నీవడ్డు రాకుము' అని వాడు శరీరమునకు ప్రత్యుత్తరమిచ్చును.

దేహం నీకు వాహనం, నీవెక్కు గుర్రం. కావున దానిని ఆదరించి చక్కగా కాపాడాలి. దానికి శక్తికి మించిన పని ఇయ్యరాదు. దానికి పరిశుద్ధములగు అన్నపానములనే ఇచ్చి మేపాలి. లేశ మాత్రమైనా మైల లేక ఉండునట్లతి అతి పరిశుద్ధంగా నెల్లప్పుడూ వుంచాలి. పరిశుద్ధియు, ఆరోగ్యం ను పూర్ణంగా వుండు శరీరం లేనిచో, నీవు విరామము లేని శ్రమకు వోర్చి ఈ కఠినమగు సాధనం చేయజాలవు. ఎట్లన నీ శరీరం నీకు ఎల్లప్పుడును లోబడి వుండవలెను గాని నీవు శరీరమునకు లోబడి యుండరాదు.

కామమయ శరీరానికీ దాని కోరికలుంటాయి. అవి అనేకం. నిన్ను కోపించుకొమంటుంది. పరుష వాక్కులు ఆడమంటుంది. ధనమునకై పేరాశ పాడమంటుంది. ఇతరులకు వుండేది చూచి యోర్వకుండమంటుంది. ఖిన్నుడవై పరవశతనొంద మంటుంది. వీనిని కాక మరి అనేక కోరికలు కోరుతుంది. ఇట్లా కోరుట నీకు కీడు చేయాదలచి కాదు. ఇట్టి బలమగు తాకులు తాకుటయు, సారి సారికీ తాకులు మారు చుండుటయుదానికిష్టం. ఇవి యొక్కటియు నీకేమో అక్కరలేదు. కావున నీ కోరికలలో నీవి యేవి, నీ శరీరం కోరికలేవీ అని వివేచనం చేయాలి.

Thursday, July 22, 2010

పరమ గురు చరణ సన్నిధి


జిడ్డు కృష్ణమూర్తి రాసిన
'పరమ గురు చరణ సన్నిధి'
పుస్తకం నుండి....

ఉపోద్ఘాతం

ఇందులో రాసినవి నా మాటలు కావు. నాకుపదేశించిన పరమ గురువు మాటలు. వారు లేక పోతే నేనేమీ చేసి వుండలేను, గాని వారి సహాయము చే నేను మోక్ష మార్గమును ప్రవేశించాను. నువ్వు అదే మార్గం ప్రవేశింప ఇచ్చ గలవాడవు. కాబట్టి వారు నాకుపదేశించిన వాక్కులు నీకు కూడా సహాయంగా వుండును.ఆ మాటలను అనుష్టించాలి సుమా! ఆ మాటలు సత్యములని, రమణీయములని చెపితే సరిపోదు. చెప్పిన ప్రాకారం జవదాటక అనుష్టించిన గాని నువ్వు కడతేరజాలవు. ఆహారాన్ని చూచి అది బాగుగా వున్నదనుటచే ఆకలిగొన్న వాని ఆకలి తీరదు. చేయి చాచి ఆ అన్నం తినాలి కదా. అట్లానే పరమ గురువుల వాక్కులు వినటం చాలదు. వారు చెప్పే ఒక్కొక్క మాట గమనించి వారు సూచించు ఒక్కొక్క అంశాన్ని గ్రహించి వారు చెప్పినట్లు నడుచుకోవాలి. వారి సూచనల్లో ఒక్కటి గ్రహించకపోయినా, వారి మాటల్లో ఒక్కటి విడిచినా, అది యెప్పటికిని పోయినదే. వారు చెప్పినది మరల చెప్పారు సుమా.

ఈ మార్గమున నాలుగు సాధనాలున్నవి.
1. వివేకం. 2. నిష్కామత్వం ( విరాగం) 3. సదాచారం 4. ప్రేమ. వీనిలో ఒకొక్కదానిని గురించి నాకు పరమ గురువు ఏం ఉపదేశించారో దాన్ని మీకు చెప్తాను.

వివేకం

ఇందులో మొదటి సాధనం వివేకం. ఇది మోక్ష మార్గమున చేర్చు సదసద్వివేకమని కూడా అంటారు. ఇది సరియైనదే. అయినా దీని లో మరి కొంత గొప్ప విశేషముంది. ఆ మార్గారంభమునే కాదు, అడుగడుగునా ప్రతి దినం అభ్యసింపదగినది. పొండదగిన వస్తువులన్నీ ఆ మార్గమునే లభిస్తాయని నేర్చుకున్నావు కాబట్టే నువ్వు ఈ మార్గమున ప్రవేశించావు. తెలియని వారు ధనము గూర్చి, అధికారం కోసం పాటుపడతారు.కానీ అవి యెంత కాలం వున్న ఒక్క జన్మం లో విడిచిపోతాయి. కాబట్టి అవి అసత్తులు. సత్తులును, నిత్యములును అయి వీని కంటే అధికమైన వస్తువులు వున్నాయి. ఒక సారి చూస్తే నువ్వు ఇక ఇతర వస్తువులను కోరవు.

ప్రపంచం లోని మనుష్యులు రెండు రకాలు. తెలిసిన వారు, తెలియని వారు. ఈ తెలివి ఒక్కటే ముఖ్యమైనది. ఏ మతం అవలంబించు వాడు, ఏ జాతి వాడు అనేది ముఖ్యం కాదు. నిజంగా ముఖ్యమైనది ఈ జ్నానమే. మానవులను గురించి ఈశ్వరుడు చేసిన కట్టుబాటు ఇట్టిదని తెలిసుకోవటమే జ్నానం. భగవంతుడే అట్టి కట్టుబాటు చేసి వున్నాడు. అదే ప్రపంచ పురోవృధ్ధికి మార్గం. ఎవరైనా ఆ మార్గమిట్టిదని చూచి వాస్తవంగా తెలుసుకుంటే, అతి తేజో వంతము, అతి రమణీయం అయిన ఆ మార్గం లో పాటుపడి ఆ మార్గముతో ఏకీభవించకుండా వుండడు.ఇలా తెలుసుకోవటం వల వాడు భగవంతుని పక్షమున చెరును. ధర్మం అవలంబించి అధర్మం నేదిరించును. లోకం యొక్క శ్రేయస్సు కోసం పాటు పడతాడు. స్వప్రోయోజనమును కోరుకోడు.
ఇలా భగవంతుని పక్షమున వుంటే అతడు మాలో ఒక్కడు అవుతాడు. హిందువని, బౌద్ధుడు అని గాని, క్రైస్తవుడని గాని, మహమ్మదీయుడని గాని పేరు పెట్టుకున్నా, హిందు దేశ వాసి యైనా, ఆంగ్లేయ దేశ వాసి యైనా, చీనా దేశస్తుదైనా, రష్యా దేశపు వాడైనా భేదం కొంచెం కూడా లేదు. భగవంతుని పక్షమున వుండే వాళ్ళు ఏ కారణము తో ఈ లోకానికి వచ్చారో తామేమి చేయాలో దాని ని తెలుసుకొని దానిని చేయపూనుకుంటారు. తక్కిన వారంతా తామేమి చేయాలో దానిని ఇంకా తెలుసుకోకపోవటం చేత తరచుగా అవివేకంగా నటిస్తూ , అందరూ ఒక్కటే అని, ఒక్కడే అయిన భగవంతుడి ఇచ్ఛయే ఎపుడూ గాని అందరికీ యథార్థంగా ప్రియంగా వుండదని తెలుసుకోలేక, తమకు మాత్రం ప్రియమని తోచు మార్గాల్నీ కల్పించేందుకు పూనుకుంటారు. అట్టి వారందరూ అసత్తును అనుసరించు వారలు గాని సత్తు ననుసరించుట లేదు. ఈ రెంటికి వున్న తేడా తెలుసుకునేంత వరకూ వారు భగవంతుని పక్షమున చేరినవారు కారు. కాబట్టి ఈ వివేకం మొదటి మెట్టు.

(సశేషం)

Wednesday, July 21, 2010

గురువు ఆవశ్యకత గురించి వివేకానందుడి వాణి

ప్రతి జీవి పరిపూర్ణత గాంచటం విధాయకం. పర్యవసానం లో ప్రతి ప్రాణి పరిపూర్ణత పొందుతుంది. మన వర్తమాన స్థితి, మన పూర్వ కర్మం, మన పూర్వాలోచనల ఫలితం; ఇలాగే మన భావి స్థితి ప్రస్తుత కర్మలకూ, భావాలకు ఫలితం. కానీ ఇలా మన భావి స్థితి ని నిర్మించుకోవటం మనలను పరుల సాయం పొందనివ్వక అడ్డదు; అంతే కాదు, అనేకులకు అలాంటి సాయం అవశ్యం కావలసి వుంది. అది లభించినప్పుడు ఆత్మ శక్తి సామర్ధ్యాలు ఉద్దీపితాలవుతవి. పారమార్ధిక జీవితం ప్రబోధ మందుతుంది. అభివృధ్ధికి చురుకు కలుగుతుంది. చివరకు మానవుడు పావనుడై పరిపూర్ణత పొందుతాడు.

ఈ ఉద్దీపన శక్తిని పుస్తకాల నుంచి పొందలేము. ఆత్మ మరొక ఆత్మ నుంచి ప్రేరణ పొందుతుంది; వేరే మార్గం అసాధ్యం; యావజ్జీవం గ్రంధపఠనం చేస్తాం గాక, మహా మేధావిధులమవుతాం గాక. కానీ చివరకు మనం రవంత కూడా ఆత్మ వికాసం పొందలేదని మనకే తెలుస్తుంది. ధీవికాసం పొందే దానికి అనురూపమైన ఆధ్యాత్మికోన్నతి లభిస్తుందనుకోటం సత్యదూరం. గ్రంధపఠనం లో మనం పారమార్ధిక సహాయం పొందుతున్నామని ఒకొక్కప్పుడు భ్రమిస్తుంటాము; కానీ గ్రంధ పఠనం వల్ల మనకు కలిగే ప్రతిఫలాన్ని పరికిస్తే చివరకు దానివల్ల కొంచెమో, గొప్పో లాభం పొందటం కేవలం మన ధీశక్తికి కలుగుతోంది. కానీ అంతరాత్మకు కలగటం లేదని మనకు వెల్లడి అవుతుంది .

ఆధ్యాత్మిక విషయాలను గురించిదాదాపుగా ప్రతి వ్యక్తీ అత్యద్భుతం గా మాట్లాడగలిగీ , అనుష్టానానికి నిజమైన పారమార్ధికాచరణానికీ వచ్చేసరికి, ఎంత శోచనీయం గా వెనుకబడి వుంటామో మనం ఎరుగనిది కాదు. ఈ వ్యత్యాసానికి కారణం గ్రంధ పఠనం ఆత్మ వికాసానికి పెంపొందింప చేయకపోవటమే అని చెబుతాను. ఆత్మ జ్యోతి ని ఉద్దీప్తం చేయాలంతే తగిన ప్రేరణ శక్తి మరొక ఆత్మ నుంచి ప్రసరించి తీరాలి.
ఇలాంటి ప్రేరణ శక్తి ఎవరిలో నుంచి ప్రసరిస్తుందో అతడే గురువు. దాన్ని గ్రహించేవాడే శిష్యుడు. ఇలా ఎవరినైనా ప్రేరేపించటానికి గురువు శక్తిని సంక్రమింపచేయగలవాడుగా వుండాలనటం మొదటి విషయం. రెండవది దాన్ని గ్రహించే వ్యక్తి అందుకు అర్హుడై వుండాలి. బీజం సజీవమై వుండాలి; క్షేత్రం సాగుచేయబడి సిద్ధంగా వుండాలి.ఇవి రెండూ చేకూరితే పారమార్ధిక చింత అనే సస్యం అత్యద్భుతంగా ఫలిస్తుంది. నిజమైన ధర్మ ప్రబోధకుడు ఆశ్చర్యకరమైన శక్తులు కలిగి వుండాలి. శ్రోత కూడా కుశలుడు లభించాలి. ఇలా ఇద్దరూ అద్భుత వ్యక్తులై అసాధారణులైనప్పుడు మాత్రమే దివ్యమైన ఆత్మ ప్రబోధం జరుగుతుంది. ఇలాంటి వారే నిజమైన ఆచార్యులు,నిజమైన శిష్యులు,నిజమైన జీజ్ణాసువులు. ఇతరులందరికీ జిజ్నాస అనేది వట్టి వినోదం, ఆట. వారి లో ప్రబోధం పొందేదీ రవ్వంత కుతూహలం, ప్రజ్వలించేది రవ్వంత వైజ్నానిక పిపాస.అంతే గాని వారు మత ధర్మ దిక్చక్రాంచలమ్ లో నిలబడి వున్నారు. అయినా ఇదీ కొంత ప్రయోజనకరమే; ఎందుకంటే కాలక్రమాన ఇది నిజమైన పారమార్ధిక జిజ్నాస అనే దాహాన్ని జనింప చేయవచ్చు; అంతే గాక క్షేత్రం సంసిద్ధమవగానే బీజం వచ్చి పడుతుంది, పడి తీరుతుంది; ఇది మనకు అగోచరమైన ప్రకృతి శాసనం. ఆంతరంగం లో నిజమైన జిజ్నాస జనించగానే అలాంటి వ్యక్తికి తోడ్పడటానికై జ్నాన ప్రదాత అయిన గురువు కనిపిస్తాడు, కనిపించి తీరుతాడు. తాత్విక తేజాన్ని ఆకర్షించుకునే శక్తి శిష్యుడి లో ధృడమై పరిపూర్ణత నొందగానే దాన్ని సఫలీకృతం చేసే శక్తి క్రమం గా లభించి తీరుతుంది.

కానీ భక్తి మార్గాన కొన్ని గొప్ప ప్రమాదాలున్నాయి. ఆచార్యుడి వల్ల తత్వాన్ని గ్రహించే శిష్యుడు తాత్కాలికావేశాన్ని- భావావేశాన్ని – నిజమైన జిజ్నాస గా భ్రమించవచ్చు. మన జీవితాల్లోనే దాన్ని మనం గమనించవచ్చు. మనం ప్రేమించిన వ్యక్తి ఒకడు మరణించటం ఎన్నోసార్లు తటస్థీస్తుంది, మన గుండె పగులుతుంది. సమస్తం నశించిపోతూందని మనకు తోస్తుంది; అంతకంటే నిత్యమూ ఉన్నతమూ అయినదేదైనా కావాలనిపిస్తుంది. ఇక మనం పారమార్ధికాసక్తులం కావాలని భావిస్తాం. కొన్ని రోజులు గడవగానే ఆ శ్మశాన వైరాగ్య తరంగం సమసిపోతుంది; ‘ ఎప్పటి కాలు ఎట్టెట్టే ‘ అన్నట్లు మళ్ళా పూర్వ స్థితి సంప్రాప్తమవుతుంది. ఇలాంటి క్షణిక భావావేశమే పారమార్ధిక జిజ్నాసగా మనమంతా తరచూ భ్రమపడుతుంటాం. కానీ ఇలా భ్రమపడుతున్నంత వరకూ యథార్థం,నిరంతరం అయిన పారమార్థిక పిపాస కలగదు; అలాంటి ప్రబోధమొనరించే నిజమైన ఆచార్యుడు లభించడు. కాబట్టి మన సత్యాన్వేషణమంతా నిష్ప్రయోజనమైనదని వాపోవ బుద్ధి మారినప్పుడల్లా, అలా వాపోవటానికి మారు, ఆత్మపరీక్ష చేసుకొని మనకు నిజమైన జిజ్నాస వుందా లేదా అని విచారించటం మన ప్రధమ కర్తవ్యం. అలా చేసినట్లయితే నూటికి తొంభై పాళ్ళు తత్త్వ జ్నానానికి మనకు ఇంకా అర్హత కలుగలేదనీ మన జిజ్నాస నిజమైనదీ కాదనీ వెల్లడవుతుంది.

తత్త్వోపదేశం చేసే గురువు విషయం లో ఇంత కంటే గొప్ప ప్రమాదాలున్నాయి. స్వయం గా అజ్నానపంక నిమగ్నులమై వుండీ గర్వాతిరేకం తో సర్వజ్నులమని విర్రవీగుతూ, అంతటితో ఆగక, పరులను తరింప చేయడానికై తమ భుజాలానందివ్వటానికి వెనుతియ్యక, కానన్న వారు కానన్నవారికి నాయకులై చివరకు వారూ వీరూ కలిసి గోతి లో పడుతూంటారు.

“ మూఢులు అజ్నానాంధకారం లో గోరాడుతూ, మా కంటే ధీరులు లేరని విర్రవీగుతూ , పండితమ్మన్యులై, గుడ్డివారి చేత నడపబడే గుడ్డివారి మాదిరి తొట్రుపాటు చెందుతూ పరిభ్రమిస్తుంటారు.” ప్రపంచం ఇలాంటి పండితమ్మన్యులతో నిండి వుంది. ప్రతి వ్యక్తికీ తాను ఆచార్యుణ్ణి కావాలనే తహతహ! ప్రతి యాచకుడికీ తాను పదిలక్షలు దానం చేయాలనే ఆవేదన! ఈ యాచకుల మాదిరే ఈ ఆచార్యులు నిజానికి హాస్యాస్పదులే.


( వివేకానందుడి “ భక్తి యోగం “ నుంచి....)

Tuesday, July 20, 2010

బుద్ధుడు చెప్పిన మధ్యే మార్గం

ఆరోజుల్లో శరీరాన్ని శుష్కింప జేసుకుంటే కాని ముక్తి లభించదని సన్యాసానికి సంబంధించిన తాత్వికులు భావించేవారు. కాని గౌతముడు అటువంటి వాటివలన ప్రయోజనం లేదని వాస్తవానికి అవి ఒకడి బుద్ధిని పట్టుదలను క్షీణింప జేస్తాయని గ్రహించాడు. ఈ బాధాకరమైన విధానాన్ని వదిలేసాడు. అలాగే దీనికి వ్యతిరేకంగా రెండో అంచున వున్న నైతిక ప్రగతికి ఆటంకమైన స్వర్గ సుఖాలలో ఓలలాడే విధానాన్ని కుడా వదిలేసాడు. ఆ కొస ఈ కొస కాని మధ్యే మార్గం ఎన్నుకోవాలనే ఆలోచన చేసాడు. ఈ మధ్యే మార్గం తరువాత తరువాత అతని బోధకు ముఖ్య లక్షణమైంది.

ఆనాడు తన తండ్రి ఏరువాక లో నాగలి దున్నుతున్న సమయం లో , తాను వెలగ చెట్టు చల్లటి నీడ లో , వ్యస్తపాదుడై తన శ్వాస పై తాను కేంద్రీకరించినప్పుడు, సాధించిన ఝానాన్ని, ( లేదా పరమానందం, లేదా సిద్ధి) ఒక సారి గుర్తు చేసుకొని ఇలా అనుకున్నాడు, “ మంచిది. జ్నానోదయానికి ఇదే మంచి మార్గం".

అలా శుష్కించిన దేహం తో జ్నానోదయం సాధ్యం కాదని గుర్తించాడు.ఆధ్యాత్మిక ప్రగతికి దేహ దారుడ్యం ముఖ్యం. అందుకని అతడు మితం గా శరీరాన్ని పోషించాలనుకొని ఘన, ద్రవ ఆహార పదార్ధాలను తీసుకోవడం మొదలుపెట్టాడు.

అతను ఏదో సాధిస్తాడు, సాధించింది తమకు చెప్తాడు అని ఎదురుచూసిన అతని శిష్యులు, అతడు తన విధానాన్ని మార్చుకోవడం తో నిరాశ చెంది,అతనిని, ఆ ప్రదేశాన్ని విడిచి ఇసి పట్టణానికీ వెళ్ళి, అక్కడి వారందరికీ, “ గౌతముడు విలాస జీవితాన్ని గడుపుతున్నాడు. తపోసమరాన్ని విడనాడి సుఖ జీవితాన్ని స్వీకరించాడు" అని చెప్పారు.

సహాయం అవసరమైన ఆ సంకట సమయం లో అతనిని వొంటరీ వానిని చేసి, వదిలిపెట్టి పోయారు. అయినా అతడు నిరాశ చెందలేదు. ఆ మహా సమరం లో వారి సాన్నిధ్యం సహాయ కారియే అయినా, వారి ఐచ్చిక ఎడబాటు అతనికి ప్రయోజన కారియే అయింది. ఏకాంతంగా, అరణ్యాలలో , వొంటరీ తనం లో , గొప్పవాళ్ళు నిగూడ సత్యాలను కనుగొన్నారు, రహస్యమైన సమస్యలను కూడా ఛేదించారు.

సత్యోదయమ్

కొంత ఘన ఆహారంతో, పోయిన బలాన్ని పుంజుకున్నాడు. అతడు చిన్నతనం లో సాధించిన ఝానానికి తేలికగానే మెరుగు పెట్టాడు. క్రమక్రమం గా రెండు, మూడు, నాలుగు ఝానాలను గూడ అతను సాధించాడు.

ఝానాల సాధనతో మనస్సు ని పరిపూర్ణ ఏకాగ్రత తో నిలప గలుగుతున్నాడు. ప్రతి వస్తువుని దాని వాస్తవాకుర్తి లో ప్రతిబింబించే తుడిచిన అడ్డమ్లా, అతని మనస్సు ఇప్పుడు ఉంది. ఈ విధం గా అతని మనస్సు ప్రశాంతమైంది, పరిశుద్ధమైంది. నిర్మలమైంది. లాలస, మురికి నుంచి స్వేచ్ఛ పొందింది. సామ్యమైంది. దృడమైంది. స్థిరమైంది. అకంపితమైంది. అప్పుడు పూర్వ జన్మల స్మృతులకు సంబంధించిన జ్నానమ్ మీదికి మనస్సుని మరలించాడు. గత జన్మలలోని తన వివిధ భాగ డేయాలను గుర్తు తెచ్చుకున్నాడు. “ మొదట ఒక జీవితం, తరువాత రెండు జీవితాలు, ఆ తరువాత మూడు, నాలుగు ఐదు, పది, ఇరవై, ఏభై జీవితాల వరకూ, ఆ తరువాత వంద, వేయి, వంద వేలు, ఆ తరువాత అనేక విశ్వ ఆవృతాల (చక్రాల ) వలయాన్ని ఆ తరువాత అనేక విశ్వ ఆవృతాల లయ, పరిణామాలను గుర్తు తెచ్చుకున్నాడు. ఆ చక్రం లో అప్పట్లో తాను ఫలానా, తన పేరు ఫలానా, తన కుటుంబం ఫలానా, తాను ఫలానా ఆహారం తినేదాడు, తాను ఫలానా సుఖ దుఃఖాలను అనుభవించాడు. తన అంతం ఫలానా విధం గా జరిగింది, మళ్ళీ అక్కడ బయలుదేరి తాను మరో చోట జన్మించాడు. ఈ జన్మలో తన పేరు ఫలానా, అనుభవించిన సుఖదుఃఖాలు ఫలానా, ఫలానా విధం గా తన అంతం జరిగింది. అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ జన్మించాడు".

ఈ విధం గా గత జన్మలలోని వివిధ భాగాడేయాల వివరాలను గుర్తు తెచ్చుకున్నాడు.

రాత్రి మొదటి జాగరణ లో అతడు వాస్తవం గా సాధించిన జ్నానమ్ ఇది.

గతానికి సంబంధించిన అజ్నానాన్ని ఈ విధంగా పారద్రోలి, అతని పరిశుద్ధ మనస్సు ని జీవుల భవాభావాలపై ( అంతరించడం, తిరిగి ఆవిర్భవించడం) సారించాడు. విమల, అతి మానవ జ్నాన (యోగా) దృష్టితో , జీవులంతా ఒక అస్తిత్వం నుంచి మరో అస్తిత్వానికి మారడాన్ని పరికించాడు. ఉచ్చ, నీచ జీవులు, అంద, అంద విహీన, సుఖులు, దుఃఖులు --- అంతా వారి వారి కర్మల ననుసరించి గతిస్తున్నారని తెలుసుకొన్నాడు. వారి చెడ్డ పనులు, మాటలు, ఆలోచనలు కారణం గా, మంచి వారిని దూషించిన కారణం గా, తప్పుడు నమ్మకాల కారణంగా, వారి శరీరాలు లుప్తమైన తర్వాత, మరణించిన తరువాత, ఈ వ్యక్తులు దుఃఖ భాగులై జన్మిస్తారని గ్రహించాడు. ఈ వ్యక్తులు మంచి పనులు, మాటలు, ఆలోచనల కారణం గా, మంచి వాళ్ళను దూషించని కారణంగా, మంచి నమ్మకాల కారణం గా, వారి శరీరాలు నశించిన తర్వాత, మరణించిన తర్వాత, సుఖకరమైన దివ్య లోకాల్లో జన్మిస్తారని తెలుసుకున్నాడు.

ఈ విధం గా అతడు తన యోగా అతి మానవ దృష్టితో జీవుల భవాభావాలను చూశాడు.
ఇది నిజం గా అతడు రాత్రి మధ్య జాగరణం లో సాధించిన రెండో జ్నానమ్.

భావికి సంబంధించిన అజ్నానాన్ని ఈ విధంగా పరిహరించిన అతడు, తన విమల మనస్సు ను మలినాల పరిచ్ఛేదం వైపు కి మళ్ళీంచాడు.
వాస్తవ విషయానుగుణంగా అతడు గుర్తించాడు. “ ఇది దుఃఖం, ఇది దుఃఖం కలగడం, ఇది దుఃఖ నివృత్తి. ఇది దుఃఖ నివృత్తి మార్గం". అలాగే వాస్తవ విషయానుగుణం గా అతడు గుర్తించాడు. “ ఇవి మలినాలు. ఇది మలినాలు పట్టడం, ఇది మలీనాల నివారణం, ఇది మలినాల నిరోధానికి దారి తీసే మార్గం". ఈ గుర్తింపు తో , ఈ గ్రహింపు తో, అతని మనస్సు విషయ వాంఛా మలినం నుంచి, అస్తిత్వ తృష్ణ మలినం నుంచి , ఆవిద్యా మలినం నుంచి విముక్తమైంది.

విముక్తుడు కావటం తో, అతడు తెలుసుకున్నాడు. “ నేను ముక్తుడనయ్యాను". అతనికి జ్నానోదయం అయింది. “ పునర్జన్మ అంతమైంది; పవిత్ర జీవితం సిధ్ధించింది, చేయవలసింది చేశాను. ఇక ఈ స్థితి సంబంధమైంది ఇంకా ఏమీ లేదు".

రాత్రి చివరి జాగరణం లో అతడు ఆర్జించిన మూడో జ్నానమ్ ఇది.
అజ్నానమ్ అంతరించింది. జ్నానోదయం అయింది. చీకటి తొలగిపోయింది. వెలుతురు వచ్చింది.

బుద్ధ దర్శనం పుస్తకం నుంచి
ఆంగ్ల మూలం : నారద మహా థేరా
తెలుగు అనువాదం : అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి
ఆనంద బుద్ధ విహార ట్రస్ట్ ప్రచురణ

Thursday, May 27, 2010

బుద్ధ దర్శనం



బుద్ధుడు

దేవతల, మానవుల ప్రయోజనం కోసం, సుఖంకోసం, మంచికోసం ఈ ప్రపంచం మీద అనుకంపతో ఒక మహాద్బుతమైన అనన్యుడైన వ్యక్తి ఈలోకంలో జన్మించాడు.ఎవరీ అద్వితీయ వ్యక్తి??అతడే తధాగతుడు. ఉన్నతుడు, జ్ఞానోదయం అయినవాడు.

అంగుత్తర నికాయం 1,1,13ప్.22

జననం నుంచి పరిత్యాగం వరకూ....

ప్రపంచంలోకే అత్యంత ధర్మ ప్రవక్త కానున్న ఓ రాకుమారుడు నేటి నేపాలులో భారతదేశ సరిహద్దులో కపిలవస్తునగరం లుంబినీవనంలో క్రీ.పూ 623 సంవత్స్పరము మే నెల(వైశాఖ శుద్ధ పూర్ణిమ)నాడు జన్మించాడు. ఇతని తండ్రి కులీన శాక్య తెగకు చెందిన శుద్ధోధన మహారాజు. తల్లి రాణి మహామాయ.అతడు పుట్టిన 7వ రోజునే తల్లి మరణించింది. ఈమె చెల్లి మహాప్రజాపతిగౌతమి. మహారాజు మరో భార్య. ఈమె తన స్వంత బిడ్డ అయిన నందుడ్ని దాదులకు అప్పగించి ఆ బిడ్డ పెంపకాన్ని చేపట్టింది.రాకుమారుని జననాన్ని పురస్కరించుకొని ప్రజలు ఘనంగా వేడుక జరుపుకొన్నారు. రాజ గురువైన అసితుడనే మహఋషి తన దివ్య దృష్టితో బిడ్డ భవిష్యత్తు మహోజ్వలంగా వుందని తెలుసుకొని తన పీఠం నుంచి లేచి నిలబడి చేతులు జోడించి ఆ బిడ్డకు నమస్కరించాడు. తర్వాత అవేదనతో నేను అరూపలోకంలో పూర్వం పొందిన జననాల కారణంగా ఈ మహామహునివల్ల కొంచం అయినా ప్రయోజనాన్ని పొందలేకపోతున్నానే అని అన్నాడు.

నామకరణ మహోత్సవం

రాకుమారుడు పుట్టిన 5వ రోజు అతనికి సిద్ధార్ధుడు అని పేరు పెట్టారు. సిద్ధార్ధుడు అంటే "సిద్ధించిన అర్ధం" (తీరిన కోరిక) కలవాడు, అతను గౌతమ గోత్రానికి చెందినవాడు, అందుకని సిద్ధార్ధగౌతముడైనాడు.

ఫ్రాచీన భారతీయ సంప్రదాయం ప్రకారం నామకరణోత్సవానికి బ్రాహ్మణ పండితులని పిలిపించారు. వారిలో ఎనిమిది మంది విశిష్ట వ్యక్తులు వున్నారు. బిడ్డ లక్షణాలను పరిశీలించిన ఎనిమిది మందిలో ఏడుగురు రెండేసి వ్రేళ్లను ఎత్తి చూపారు. దీనికి అర్ధం రెండు విధాలా జరిగే అవకాశం వుందని చెప్పడం. అంటే అతడు మహా చక్రవర్తి గాని, బుద్ధుడు గాని అయ్యే అవకాశం వుందని చెప్పారు. ఆ ఎనిమిది మందిలో అందరికంటే చిన్నవాడు, ధీమంతుడు అయిన కొండణ్ణ మాత్రం మిగతా ఏడుగురితో ఏకీభవించలేదు. రాకుమారుని నుదుటి మీద కుడివైపుకి తిరిగి వున్న వుంగరాల జుట్టు చూసి ఇతడు ఒక వ్రేలు మాత్రమే ఎత్తి చూపి ఇలా అన్నాడు “ రాకుమారుడు ఖచ్చితంగా సంసార లంపతాన్ని త్యుజించి, బుద్దుడే అవుతాడు” అని అతి విశ్వసనీయం గా చెప్పాడు.

వైవాహిక జీవితం

తనకు ఈడూ జోడూ అయిన అందాల రాణి యశోధర ను, తన పదహారవ ఏట వివాహ మాడాడు. వివాహానంతరం దాదాపు పదమూడు సంవత్సరాలు భోగ జీవితాన్ని గడిపాడు. రాజప్రాసాద ప్రాకారానికి వెలుపలి జీవితం, వొడిదుడుకుల గురించి తెలియని ఆనందంలో అతని జీవితం సాగింది. రాకుమారునిగా తన భోగ జీవితాన్ని గురించి అతడు ఇలా అంటాడు.

“ నేను సున్నిత మనస్కుడను. అత్యంత సున్నిత మనస్కుడను. నా తండ్రి గారి నివాసం లో ప్రత్యేకించి నా కోసం మూడు పద్మాల కొలనులను నిర్మించారు. ఒక కొలనులో నీల లోహిత పద్మాలు వికసించాయి. మరో దానిలో అరుణ పద్మాలు, వేరొక దానిలో శ్వేత పద్మాలు వికసించాయి. కాశీకి చెందని ఏ గంధపు చెక్కలను నేను వాడలేదు. నా తలపాగా, అంగీ, దుస్తులు అన్నీ కాశీ నుంచి వచ్చినవే.”

“ ఎండ , చలి, ఆకులు, దుమ్ము, మంచు –ఏదీ నన్ను తాకాకుండా రేబవలు నాపై ఒక శ్వేత ఛత్రాన్ని పట్టి వుంచారు.”

“ నాకోసం మూడు ప్రాసాదాలను నిర్మించారు – ఒకటి చలి కాలానికి, మరొకటి వేసవికి, వేరొకటి వర్షాకాలానికి. వర్షాకాలం నాలుగు నెలలు. వర్షాకాల భవనం లో ఒక్క సారి గూడ బయటకి రాకుండా వున్నాను. ఈ కాలం అంతా సంగీత విదూషీమణులు గానం వినిపించారు. ఇతరుల ఇళ్ళల్లో పులిసిన గంజి వూక నుంచి తయారైన అంబాలిని బానిసలకు, పనివాళ్ళకు ఎలా ఇస్తారో, అలాగే మా తండ్రి గాని నివాసం లో బానిసలకు, పనివాళ్లకు బియ్యం, మాసాలతో తయారైన ఆహారాన్ని ఇచ్చారు.”.

కాలం గడిచేకొద్దీ క్రమంగా అతనికి జీవిత వాస్తవాలు తెలియసాగాయి. అతని నిశిత పరిశీలనాప్రవృత్తి, హద్దులేరగని అతని అనుకంప, అతనిని రాజప్రాసాదంలో క్షణికానందమ్ లో కాలం వెళ్ళదీయనీయలేదు. అతడు వ్యక్తిగత దుఃఖమంటూ ఒకటి ఎరగడు. కానీ అతడు మానవాళి బాధను తన బాధగా చేసుకొన్నాడు. సుఖభోగాలమధ్య అతడు దుఃఖ సార్వత్రికతను గుర్తించాడు.

(నేడు బుద్ధ జయంతి సందర్భం గా)

(సశేషం)

Sunday, March 7, 2010

నీవెవరివో నువ్వు కనుక్కో!


మెలకువలో ప్రతీక్షణం మనం అలోచిస్తూనే వుంటాం. స్వప్నంలో కూడా అంతే. ఎన్నెన్నో ఆలోచించడం అనే గాఢమైన వ్యసనం వలన ఘర్షణ, అలజడి, ఆందోళన, దుఃఖాలు కలుగుతున్నాయి. వివిధ రకాల ఎన్నెన్నో తలంపుల వలన మనసు విచ్ఛిన్నమవుతుంది. చాలా బలహీనమవుతుంది. ఇలా గందరగోళంగా వున్న మనసుకు, ఏదైనా ప్రత్యామ్నాయం వుందా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అవును ఉంది, ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన 'నేనెవరు? విచారణలో ' వున్నది. ఈ విచారణలో దృష్టి ధ్యాసనంతా మనసు కోశం, కేంద్రమైన నేను అనే భావన/అహంకారం/ 'ఆలోచించేవాడు' పై, యితర తలంపులన్నింటినీ దూరం చేస్తూ, కేంద్రీకరించి లగ్నం చేసి నిలపాలి. అలాంటి దృష్టి ధ్యాస వలన భగవాన్ రమణుల అనుగ్రహం సహాయం తోడురాగా శుద్ధనిర్మల మనసు యొక్క సహజ మౌన ప్రశాంత పరమానంద స్థితిని కనుక్కోగలరు ఎవ్వరైనాసరే. వారు అపుడు అంతరంగ నిశ్చలత పరమప్రశాంతతతో అన్ని కార్యాలు విధులు ఎంతో పరిపూర్ణ నైపుణ్యంతో నిర్వర్తిస్తారు. జీవితం అంటేనే ఒక ఆటగా పూర్ణంగా ఆనందించవలసినది. మనసంతా కేంద్రీకృతమై ఎంతో ఉల్లాసంగా చురుగ్గా అనంతమైన గ్రహింపుతో సర్వ శక్తివంతంగా వుండి పని చేస్తుంది. జ్ఞానం, పనులు యీ రెండింటి మధ్య పరిపూర్ణ సమన్వయం వుంటుంది.

తనకు తాను తెలుసుకోవడం కన్నా మించిన బాధ్యత యెవరికైనా మరేదీ లేదు, ఉండదు. ఇదే మానవుడిగా, మానవుడు సాధించాల్సిన ఒకే ఒక స్థితి, గమ్యం, ఉద్ధేశ్యం, అవసరము. మానవులు కోరుకునే, అనుకునే మిగిలినవన్నీ మిధ్య, భ్రమ, భ్రాంతి మాత్రమే. ఉన్నట్లు, నిజమైనట్లు సత్యంగా అంతా అన్నీ గోచరిస్తాయి, కానీ యేమీ, యేవీ లేనివే. ఇది సత్యం. జాగ్రత్ సుషుప్తి స్వప్న యే అవస్తల్లోనైనా యెవరైనా 'నేను ఉన్నాను' అంటారు గానీ 'నేను లేను' అనరు. అనలేరు యెప్పుడూ.

అణువులోనైనా, ఆకాశంలోనైనా 'నేను' ఉంది. చెప్పవలసి వస్తే 'నేను' అణువు, 'నేను' ఆకాశం, 'నేను' చెట్టు, 'నేను' పర్వతం, 'నేను' పులి......యిట్లానే చెప్పడం జరుగుతుంది. 'నేను' లేనిది యేమీ లేదు, ఉండదు. అదే సర్వాంతర్యామి, నీవు, అందరూ, ఆన్నీ.....నీ స్వరూపమే. ఇది గ్రహించితే పరిమితమైన ప్రేమ, పూర్ణ విశాలమైన విశ్వప్రేమ అవుతుంది.

ప్రపంచం ,దేశం, కాలం అహంకారమే, అహంకారానికే. ప్రపంచ విషయాలు వస్తువులు బంధాలు ఆన్నీ అహంకారానికే. ఇవన్నీ వస్తూ,పోతూ మారుతూ వుండేవే. శాశ్వతం కాదు, సత్యం కాదు. సదా అన్ని కాలాలలో(కాలరహితంగా), సర్వత్రా అన్ని దేశ ప్రదేశాలలో(దేశరహితంగా) మార్పు లేనిదిగా పరిపూర్ణంగా అనంత శక్తిగా, మౌనంగా, చైతన్యంగా, బ్రహ్మానందంగా, ఉండేదే 'నేను'

దానినే ఉన్నది, సత్, ఆత్మ, పరంబ్రహ్మం, పరమేశ్వరుడు, నారాయణుడు, శ్రీహరి.......యిలా యెన్నో, అన్ని పేర్లూ, యే పేరయినా దానికే, దానిదే. దానికంటే వేరుగా యేదీ లేదు, ఉండదు.


ప్రపంచం(ఆబ్జెక్ట్), అహంకారం(సబ్జెక్ట్), లేనివే. చూచే అహంకారం వలననే వున్నట్లు వున్న ప్రపంచం కనిపిస్తున్నది. ఈ అహంకారాం పైనే గురిపెట్టి 'నేనెవరు? విచారణలో ' సత్ అయిన 'నేను' ను కనుక్కోగలము. భగవాన్ శ్రీ రమణ మహర్షి అనంతమైన ఓర్పుతో అనుగ్రహంతో బోధించిన యీ మార్గం యెవరికైనా అనుకూలమే, సాధన చేయగలిగేదే, సులభమైనదే, ఫలితాన్ని అతిమ విజయాన్ని తప్పక యిచ్చేదే.

జై శ్రీ రమణాయ నమః

మూలం : నీవేవరివో నువ్వు కనుక్కో

రచయత : ఏ. ఆర్. నటరాజన్

తెలుగు అనువాదం :శ్రీ రమణానుగ్రహి

Wednesday, January 20, 2010

సూఫీ మహాత్ముడు హజరత్ తాజుద్దీన్ బాబా

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో క్రీ.శ. 1850-1950 ల మధ్య కాలం ఎంతో విశిష్టమైనది. కారణం ఈ మధ్య కాలంలోనే శ్రీ శిరిడీ సాయిబాబా, మరికొందరు మహా సిధ్ధ పురుషులు ఆధ్యాత్మిక పథంలో భౌతికంగా దర్శనమిచ్చారు. ప్రపంచ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించే ఒక మహాత్ముల చక్రముందని, ఆ చక్రానికి 72 మంది వివిధ మతాలకు చెందిన సిధ్ధ పురుషులు చక్ర పత్రాలైతే, శ్రీ శిరిడి సాయినాధుడు ఇరుసులా వుంటారని- ఒక సాంప్రదాయం. వారిలో శ్రీ శిరిడి సమగ్ర జీవిత చరిత్రను, వారి సమకాలికులైన మరి నలుగురు ప్రసిధ్ధ సిధ్ధ పురుషుల –శ్రీ స్వామి సమర్ధ (అక్కల్కోట), శ్రీ తాజుద్దీన్ బాబా (నాగపూర్), శ్రీ గజానన్ మహారాజ్ (షేగాం), శ్రీ ధునీవాలా దాదా (ఖాండ్వా)-చరిత్రలను ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఆంగ్లం లోనూ, తెలుగులోనూ రచించారు. శ్రీ తాజుద్దీన్ బాబా జయంతి (జనవరి 27) సందర్భంగా శ్రీ భరద్వాజ గారు రాసిన ‘ శ్రీ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర ‘ పుస్తకం నుండి ఈ వ్యాసాన్ని తయారుచేసి ‘ సాయిబాబా’ మాస పత్రిక జనవరి సంచికలో ప్రచురించారు. నాగపూర్ కి చెందిన సూఫీ ఫకీర్ తాజుద్దీన్ బాబా జీవితం గురించి ఈ వ్యాసం ఒక చిన్న పరిచయం.
తాజుద్దీన్ బాబా జననం-సాధన
అది ఆగస్ట్ 17, 1925 వ సంవత్సరం. ఆనాడు జరిగిన రెండు సంఘటనలునాగపూర్ వాసులను ఆవేదనలోనూ ఆశ్చర్యంలోనూ ముంచివేశాయి. హజరత్ తాజుద్దీన్ బాబా ఆ రోజే సమాధి చెందడం వారి ఆవేదనకు కారణమైతే, పండరీ విఠల్, రుక్మాదేవి విగ్రహాలు పన్నెండు గంటల సేపు సంతత ధారగా కన్నీరు కార్చడం వారి ఆశ్చర్యానికి కారణం. విగ్రహారాధనను నిరసించే ముస్లిం మతానికి చెందిన ఫకీర్ హజ్రత్ తాజుద్దీన్ బాబా సమాధి చెండితే హిందు దేవతా విగ్రహాలు దుఃఖించడం విచిత్రం కాదా! దైవం హిందువా? ముస్లిమా ? అసలు ఆయన మతమేది?
ముస్లిముల చేత పీర్ (గురువు ) గా, హిందువుల చేత భగవదవతారంగా కీర్తించబడిన తాజుద్దీన్ బాబా పూర్వీకులు అరబ్బు దేశం వారు. హజరత్ ఇమామ్ ఆస్కార్ అనే ఆయన మనుమదైన సయ్యద్ అబ్దుల్లా అరేబియా దేశం నుండి హిందూ దేశానికి వచ్చి మద్రాస్ లో స్థిరపడ్డారు. చాలా కాలంగా ఆయన సంతతివారంతా మద్రాస్ పరిసర ప్రాంతాలలోనే నివసించేవారు. వారి వంశంలోని వాడే సయ్యద్ బదృద్దీన్. సయ్యద్ బదృద్దీన్ సైన్యంలో చేరి మద్రాస్ ప్లాటూన్ -32 లో సుబేదారు గా వుంటూ కాంప్టి అనే ఊళ్ళో వుండేవాడు. అతను షేక్ మీరాన్ సాహెబ్ గారి కుమార్తె అయిన మీరాన్ బీ ని వివాహం చేసుకున్నాడు.
1861 వ సంవత్సరం జనవరి 27 వ తేదీన గురువారం ఉదయం గం.5-15 నిమిషాలకు మీరాబీ కి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవానికి తాజుద్దీన్ అని పేరు పెట్టారు. అయితే తాజుద్దీన్ అందరి పిల్లల వలె ఏడవలేదు. తల్లితండ్రులు శిశువులో జీవం ఉన్నదో లేదోనని అనుమానించి గాబరా పడి శిశువుకు చైతన్యం కలిగించడం కోసం వారి ఆచారం ప్రాకారం శిశువు కణతల మీద ముఖం మీద కాల్చారు. వెంటనే శిశువు తాను జీవించే వున్నానని తెలుపడానికేమో అన్నట్లు కొద్ది క్షణాలు మాత్రమే రోదించి ఊరుకొని కళ్ళు తెరిచి అన్నీ వైపులకూ చూడదమారంభించాడు. మహాత్ముడైన తాజుద్దీన్ ముఖం మీద ఆనాడు కాల్చిన ముద్రలు శాశ్వతం గా ఉండిపోయాయి.
తాజుద్దీన్ తల్లితండ్రులకు ఆయనను బాబా తాజుద్దీన్ గా చూచే అదృష్టం లేకపోయింది. తాజుద్దీన్ పుట్టి సంవత్సరం తిరుగక ముందే అతని తండ్రి బదురుద్దీన్ చనిపోయాడు. ఆయనకు 9వ సంవత్సరం రాగానే తల్లి గూడ గతించింది. తండ్రి చనిపోయాక తాజుద్దీన్ వారి అమ్మమ్మగారి ఇంటివద్దనే పెరిగాడు. అతని ఆరవ ఏటా స్కూల్లో చేర్పించారు. 6 వ సంవత్సరం నుంచీ 18 వ సంవత్సరం దాకా తాజుద్దీన్ అరబ్బీ, పార్శీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకున్నారు.
ఆశీర్వాదం
తాజుద్దీన్ చదువుకునే బడికి ఒకసారి ఆ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన ముస్లిం మహాత్ముడు హజరత్ అబ్దుల్లాషా వచ్చారు. అప్పుడు తాజుద్దీన్ ఒకటో తరగతిలో వున్నాడు. ఆ మహాత్ముడు తాజుద్దీన్ వైపు దృష్టి నిగిడ్చి చూచి సంచీలో నుండీ కొంత మిఠాయిని తీసి కొంచెం చప్పరించి తాజుద్దీన్ నోట్లో వేశారు. తరువాత ఆ ముస్లీమ్ ఫకీర్ ఉపాధ్యాయులతో తాజుద్దీన్ చూపుతూ “ ఇతనికి మీరేం బోధించగలరు. ఇతని విద్యాభ్యాసం ఇదివరకే పూర్తయింది.” అన్నారు. “ మితంగా తిను, మితంగా మాట్లాడు, ఖురాన్ చదివేటప్పుడు మహమ్మదుల వారే నిన్నావేశించనట్లు భావయుక్తంగా పఠించు: అని తాజుద్దీన్ తో చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు.
హజరత్ అబ్దుల్లా షా ఆశీర్వదించి వెళ్ళాక తాజుద్దీన్ లో వింతైన మార్పు వచ్చింది ఏదో పారవశ్యం అతనిని ముంచివేసింది. మూడు రోజుల పాటు ఆగకుండా అతని కళ్ళ వెంట సంతత ధారగా ఆనంద భాష్పాలు కారాయి. ఆ తర్వాత తాజుద్దీన్ కు ఆట పాటల యందు ఆసక్తి తగ్గింది. ఎప్పుడూ ఒంటరిగా గడిపే తాజుద్దీన్ పుస్తకాలు చదివి అర్ధం చేసుకునే జ్నానమ్ కాలిగాక గొప్ప గొప్ప సూఫీ మహాత్ములు రచించిన గ్రంధాలను చదువుతూ క్రమం గా అధ్భూతమైన వారి జీవిత విధానాల వైపుకు ఆకర్షితుడైనాడు.
అతను చదివిన వాటన్నింటిలోకి ఒక గొప్ప ముస్లిం మహాత్ముడు చెప్పిన ద్విపద ముస్లిం తాజుద్దెన్ హృదయాన్ని ఆకట్టుకోండి. దాని భావమేమిటంటే.....
“ సారాయి త్రాగు!
ఖురాన్, కాబాలను తగులబెట్టు!
కావాలంటే దేవాలయాల్లో నివసించు!...కానీ,….
ఏ మానవుని హృదయాన్ని ఎన్నడూ గాయపరచకూ!!”
గొప్ప మహాత్ముడైన హజరత్ అబ్దుల్లా షా ఈ ద్విపదను కేవలం సాహిత్య పరమైన అర్ధం తో చెప్పారనుకోవటం సరికాదనిపిస్తుంది. సూఫీ మహాత్ములు వ్రాసే అటువంటి ద్విపదలు భావగర్భితమైన పరిభాషలో వుంటాయి. ఆ పదాలలో పైకి ప్రకటమయ్యే అర్ధం గాక లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి వుంటాయి. సామాన్యంగా వారు ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పేటప్పుడు ప్రేమ, త్రాగుడు, మైకం లాంటి పదాలను వాడుతూ వుంటారు. పైన చెప్పిన ద్విపద లో ‘ సారాయం త్రాగు ‘ అంటే భగవంతునిపై భక్తితో పారవశ్యం చెందు అని భావం. ఖురాన్ అంటే కేవలం కొన్ని కాగితాలు, వాటిపై ముద్రించబద్ద రంగు సిరా మాత్రమే కాదని, పవిత్రమైన కాబా అంటే కేవలం ఒక నల్లని రాతి ముక్క మాత్రమే కాదని, అవి రెండూ కేవలం నామరూప సహితమైన వస్తువులనే భావాన్ని వదిలి వాటికాధారంగా , అతీతంగా వున్న శాశ్వతానందాన్ని పొందడమే –ఖురాన్, కాబాలను తగులబెట్టటమంటే! దేవాలయాల్లో నివసించడమంటే ఎవరి మత ధర్మాలను వారినాచరించుకోనీమని, ఎవరి నమ్మకాలనూ, ఆచారాలనూ వారిని పాటించుకోనీమనీ భావం. అయితే ఈ మూడు ఆచరించినా, ఆచరించకపోయినా, ఇతరుల హృదయాన్ని ఎన్నడూ గాయపరచకూడదనే ఉత్తమ ధర్మాన్ని పాటించమని ఆఖరి పాదం లోని భావం. తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర అంతా ఆయన హృదయాన్ని ఆకట్టుకున్న ఈ సత్యాలను గూర్చిన మౌన వ్యాఖ్య.
తాజుద్దీన్ 18 వ ఏట కాంప్టి దగ్గరగా వున్న కమ్మాన్ అనే నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ వరదలకు అపారమైన జన నష్టం, ఆస్తుల నష్టం జరిగింది. ఎంతో మందికి నిలువ నీడ, తినటానికి తిండీ లేకుండా పోయింది. వరద బాధితుల కష్టాలను చూచి తాజుద్దీన్ హృదయం చలించింది. తల్లితండ్రులు పోయాక తాజుద్దీన్ కి ఆశ్రయమిచ్చినా మేనమామ హజరత్ అబ్దుల్లా రహమాన్ గారి ఇల్లు కూడా కూలిపోయి, ఆయనకూ ఎంతో నష్టం వచ్చింది. ఇల్లు గడవడం కోసం ఆయన అటవీ శాఖలో పని చేయవలసి వచ్చింది. ఆయనే సైన్యంలో చేరమని సలహా ఇవ్వటంతో తాజుద్దీన్ తన 20 వ ఏట 1881 వ సంవత్సరంలో 13 వ నాగపూర్ రెజిమెంట్ లో చేరాడు. సైన్యంలో వుండగా తాజుద్దీన్ ఉద్యోగ నిర్వహణలో దేశం నలుమూలలా తిరిగాడు. ఫ్రాన్స్ మొదలైన విదేశాలలో కూడా ఆయన పర్యటించారు. విదేశాల నుండి వచ్చాక వారి రెజిమెంట్ హైదరాబాద్ లో గ్రాస్ ఫారం అనేచోట స్థావరమేర్పర్చుకుంది. అక్కడ వుండగానే ‘ బెంజ్ ‘ అనే అమెరికన్ అధికారి తాజుద్దీన్ తో పరిచయం ఏర్పర్చుకొని ఆయన వద్ద ఖురాన్ అంతా నేర్చుకున్నాడు. విలియమ్స్ అనే ఆయన కూడా తాజుద్దీన్ కు సన్నిహితుడై ఆధ్యాత్మికంగా పురోగతి పొందాడు. తర్వాత విలియమ్స్ కలకత్తా వెళ్ళాడు. అక్కడ బంగ్ మేరీ అనే చోట విలియమ్స్ సమాధిని మనం నేటికీ చూడవచ్చు.
1884 వ సంవత్సరంలో తాజుద్దీన్ సైనిక దళం సాగర్ అనేచోటికి చేరింది. సైన్యంలో పని చేసే రోజుల్లో కూడా తాజుద్దీన్ నమాజ్ చేయడంలో ఎప్పుడూ ఆశ్రధ్ధ చూపలేదు. సౌగర్ లో వుండేటప్పుడే ఒక రోజున తాజుద్దీన్ కు అతి మధురమైన గానం వినిపించింది. ఆ గానం చేస్తున్న వారెవరో వెతుక్కుంటూ బయల్దేరి ఊరూ బయట నివసిస్తున్న హజరత్ దావూద్ షా చిస్తీ అనే ముస్లిం మాహాత్ముని నివాసం చేరాడు. అది మొదలు ప్రతి రోజు తన ఉద్యోగ ధర్మం ముగిశాక తాజుద్దీన్ ఆ మహాత్ముని సాంగత్యంలో గడిపేవాడు.
ఆయన సన్నిధిలో ఎంతో సేపు ధ్యానం చేసేవాడు. తరచుగా రాత్రంతా అక్కడే గడిపి తెల్లవారాక శిబిరానికి వెళ్ళేవాడు. తాజుద్దీన్ రాత్రిళ్లు తరచుగా ఎటో వెళ్తున్నాడని కాంప్టి లో వుండే ఆయన బామ్మ గారికి తెలిసింది. తాజుద్దీన్ చెడు సావాసాలు చేస్తున్నాడేమోనని తలచిన ఆమె మనవణ్ణి మందలించడానికి సౌగర్ వచ్చి రహస్యంగా ఒకరోజు రాత్రి తాజుద్దీన్ ను వెంబడించింది. తాజుద్దీన్ నేరుగా ముస్లిం మహాత్ముని వద్దకు వెళ్ళి దైవ ధ్యానం చేసుకుంటూ వుండటం చూసి సంతోషంగా తిరిగి వచ్చింది. మరునాడు ఉదయమే తిరిగి వచ్చిన తాజుద్దీన్ కి ప్రేమతో ఫలహారం అందించింది బామ్మగారు. కానీ తాజుద్దీన్ వాటిని తినక తన చేతిలో వున్న రెండు రాళ్ళను బామ్మ గారికి చూపిస్తూ “ ఇవిగో నా దగ్గర లడ్డూ, జిలేబీ వున్నాయి.” అంటూ వాటిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ తినేశాడు. తాజుద్దీన్ చేసిన ఈ పని బామ్మగారిని ఆశ్చర్యంలో ముంచేసింది. దైవ చింతనలో ఎక్కువ సమయం గడపడం వల్ల తాజుద్దీన్ లో అతీత శక్తులు మేల్కొన్నాయని గుర్తించిన బామ్మగారు మనుమడు ఏ దుష్ట సాంగత్యాన్నికి లోనూ కాలేదని సంతోషిస్తూ తిరిగి కాంప్టి చేరింది. హజరత్ దావూద్ చిస్తీ కొద్దికాలం తర్వాత మరణించారు. ఆ తర్వాత కూడా తాజుద్దీన్ ఆయన సమాధి వద్ద ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించారు.
ఆయన చేసిన అసంఖ్యాకమైన లీలలు, బోధలు ఆయన దివ్య చరిత్ర లో వివరం గా చదవవచ్చు.
----శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర నుండి...
రచన : శ్రీ ఎక్కిరాల భరద్వాజ
పుస్తకాలు దొరుకు చోటు...
శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్, ఎం.ఎం.డొంక, ఒంగోలు -523002,
ఫోన్ నెంబర్ 08592-233271

Tuesday, January 12, 2010

కర్మ సూత్రం –వివేక వాణి




కర్మ సూత్రం విషయంలో హిందువులే కాక బౌధ్ధులు, జైనులు, అందరూ ఏకాభిప్రాయులవుతున్నారు. జీవం నిత్యమని అందరూ అంగీకరిస్తారు. అది శూన్యం నుండి కలిగిందనడం తగదు ; అది అసంభవం. అటువంటి జీవం ఎందుకూ కొరగాదు. ఎందుకంటే, కాలంలో దేనికి మొదలుందో, కాలంలో దానికీ తుదీ వుంటుంది. జీవం నిన్న ప్రారంభమైతే, రేపు అంతరించి తీరాలి! అప్పుడు సర్వనాశనమే ఫలితార్ధం. జీవం శాశ్వతమై వచ్చేదే! దీన్ని గ్రహించడానికి పెద్ద మేధా శక్తి అవసరం లేదు. ఈనాటి ప్రకృతి శాస్త్రాలన్నీ మనకు తోడ్పడుతున్నాయి. అవి మన ధర్మ శాస్త్రాలకు భౌతిక ప్రపంచంలో నిదర్శనాలు చూపుతున్నాయి. మనలో ప్రతి వాని స్థితి అనంతమైన పూర్వ జన్మల ఫలితార్ధమే అని మీకు తెలుసు.

లోకంలో ఒక బిడ్డ పుట్టాడనుకోండి. అతడు ప్రకృతి చేతిలో నుండి తళుక్కుమని తటాలున వూడిపడటం లేదు. కవులు అలా వర్ణించి ఆనందించినా, ఆనందింతురు గాక! కానీ, బిడ్డ నెత్తి మీద అనంతమైన పూర్వ కర్మ భారముంది. మంచో, చెడో తన పూర్వ కర్మలను పరిష్కరించుకునే నిమిత్తమే, అతడీ లోకానికి వస్తున్నాడు. ఇదే కర్మ సూత్రం. మనలోని ప్రతివాడు, తన అదృష్టానికి తానే కర్త అవుతున్నాడు. ఈ సూత్రం ‘ విధి వ్రాత ‘, ‘ దైవ సంకల్పం ‘ అనే వాదాలను ఎగురగోట్టేస్తోంది. ఈ సూత్రమే భగవంతునికీ, మానవునికీ సమాధానం కూర్చడానికి ఆధారమవుతోంది. మన దుఃఖాలకు మనమే బాధ్యులం ; ఇంకెవరూ కారు. కార్య రూప ఫలం మనమే ; కారణమూ మనమే. అందువల్లే, మనం స్వతంత్రులం అనడం.

నేను దుఃఖినైతే, ఆ దుఃఖం నేను తెచ్చి పెట్టుకున్నదే. నేను తలచుకుంటే, సుఖవంతుడనుగా మారగల ననడానికి అదే నిదర్శనం. నేను దుష్టుడనైతే అదీ నా కర్మ ఫలమే. కాబట్టి నేను తలపెడితే పవిత్రుడిని కాగలననడానికి రుజువు కూడా అదే. నరుని ఇచ్ఛా శక్తి పరిస్థితులన్నింటికీ అతీతమై వొప్పుతోంది. దీని ముందు అంటే, నరునిలో వున్న బలిష్టం, మహత్తరం, అఖండం అయిన ఇఛ్ఛాస్వాతంత్ర్యాల ఎదుట, ప్రకృతి కూడా జోహారనవలసిందే ; తల వంచి దాస్యం చేయవలసిందే. కర్మ సూత్రం యొక్క మహిమా ఇలాంటిది సుమండీ!!

(
వివేకానంద- హిందు మతం పుస్తకం నుండి )

(జనవరి పన్నెండు వివేకానంద జయంతి సందర్భంగా....)

Sunday, January 3, 2010

ఆత్మ ప్రబోధం మరొక ఆత్మ నుంచే రావాలి!



గురువు గురించి వివేకానందుడి పలుకులు

ప్రతి ఆత్మకూ పరిపూర్ణత పొందటమే విధాయకం. ప్రతి ప్రాణీ చివరకు పరిపూర్ణత పొందే తీరుతుంది. మన ప్రస్తుత స్థితి మన గత జన్మ కర్మల భావాల ఫలం. మన భవిష్యత్ స్థితి మన ఇప్పటి కర్మల, భావాల ఫలమై వుంటుంది. అంటే మన అదృష్టానికి మనమే కర్తలం. అయినా మన అదృష్ట నిర్మాణ కార్యంలో మనం ఇతరుల సహాయం పొందరాదనే నిషేధం ఏమీ లేదు. ఏ కొద్ది మందికో తప్ప ఇలాంటి సహాయం జన సామాన్యమందరికీ అత్యంత ముఖ్యం కూడా. అలాంటి సహాయం లభించినప్పుడు ఆత్మ లో ప్రచ్ఛన్న రూపంలో వుండే మహోత్కృష్ట శక్తులు సచేతనలవుతవి, పారమార్ధిక జీవనం మేలుకాంచుతుంది, అభివృధ్ధి విజృంభిస్తుంది. మానవుడు చివరకు పావనత్వాన్ని, పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. ఈ వుజ్జీవన శక్తి గ్రంధాల నుంచి రాదు. ఆత్మకూ ఈ శక్తి మరొక ఆత్మ నుంచే లభించాలి గాని, మరెక్కడి నుంచీ లభించదు.. జీవిత కాలమంతా మనం గ్రంధావలోకన మగ్నులమై వుండవచ్చు. మనం అత్యంత బుధ్ధి పరిణితిని ఆర్జించవచ్చు. కానీ చివరకు మనకు పారమార్ధికాభివృధ్ధి లేశమైనా ప్రాప్తించి వుండదు. మహోన్నత బుధ్ధి పరిపాకం సాధించిన మానవుడి తదనురూపమైన పారమార్ధిక పరిపాకం కూడా అలవడే వుంటుందనటం అసత్యం. గ్రంధ పఠనం చేసేటప్పుడు మనకు అందుచేత పారమార్ధిక లాభం కూడా ప్రాప్తిస్తుందని మనం ఒక్కోసారి భ్రమ పడవచ్చు.కానీ పుస్తక పఠన ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే , బుధ్ధికి ఒకవేళ బలం చేకూరి వుండవచ్చు గాని, ఆత్మ ప్రబోధం ఏమీ కలుగలేదని స్పష్టపడుతుంది. పారమార్ధిక విషయాలను గురించి మనం అందరం అత్యధ్భుతోపన్యాసాలు ఇవ్వగలిగి వుండీ , యధార్ధమైన పారమార్ధిక జీవనం గడపటంలో కేవలం కుంటుపడి వుండటానికి కారణం ఇదే. పుస్తక పఠనం పారమార్ధిక ఉద్దీపనం కలిగించే విషయంలో కేవలం అసమర్ధం అవటమే. ఆత్మ ప్రబోధం మరొక ఆత్మ నుంచే రావాలి. ఈ ప్రబోధం ఎవరి ఆత్మ నుంచి వస్తుందో, ఆ వ్యక్తిని గురువు అంటారు. అది ఎవరి ఆత్మకు ప్రసాదించబడుతుందో, ఆ వ్యక్తిని శిష్యుడంటారు. ఈ పారమార్ధిక శక్తి ఒకరి నుంచి మరొకరికి లభించాలంటే, అది వెలువడే ఆత్మ కు ప్రసాద సమర్ధతా, గైకొనే ఆత్మకూ ప్రతి గ్రహణార్హతా వుండటం అత్యావశ్యకం. విత్తనం ప్రాణవంతమై వుండాలి; చేను దున్ని చల్లటానికి సిధ్ధపరిచి వుండాలి. ఈ రెండూ సమకూడితే, యధార్ధమైన పారమార్ధిక సస్యాభివృధ్ధి అత్యధ్భుత రూపంలో వెలువడుతుంది. నిజమైన మతబోధకుడు అత్యధ్భుత ప్రతిభావంతుడై వుండాలి. శ్రోత కూడా బుధ్ధి కుశలుడై వుండాలి. “ ఆశ్చర్యోవాక్తా కుశలోస్య లబ్ధా” ఇద్దరూ ఆశ్చర్యమైన వారు గానూ, అసాధారణమైన వారుగాను వుంటే తత్ఫలంగా మహోత్కృష్ట పారమార్ధిక ఉజ్జీవనం కలుగుతుంది. కాకుంటే అలాంటిది కలగటం అసాధ్యం. అలాంటివారే నిజమైన గురువులు, అలాంటి వారే నిజమైన శిష్యులూ, సాధకులూ. తక్కిన వారు చేసేది పారమార్ధిక భావాలతో చెరలాటాలు ఆడటమే. వారికదొక వినోద క్రీడామాత్రం. అదేమిటో కాస్త తొంగి చూస్తామనే కుతూహలం, ఒకింత బుధ్ధిగ్రాహ్యం చేసికొందామనే కోరిక, వారికి కలిగింది. అంతే. పారమార్ధిక జీవన క్షేత్రపు వెలుపటి పొలిమేర చిట్టచివర వారు నిలబడి వున్నారు. కానీ, దీన్లో గూడ కొంత గుణం వుంది నిజమే. కాలక్రమాన దాని నుంచే పారమార్ధిక జ్నాన తృష్ణ ఉదయించవచ్చు. అతి నిగూఢమైన ప్రకృతి ధర్మం ఒకటి వుంది – క్షేత్రం సంసిధ్ధమవటంతోనే బీజం ప్రాప్తించాలి. ప్రాప్తించి తీరుతుంది. ఆత్మకూ పారమార్ధిక ధర్మతృష్ణ తీవ్రం గా కలిగాక దానికి ఆ తృష్ణ ను తీర్చే పారమార్ధిక శక్తి ప్రాప్తించాలి. ప్రాప్తించి తీరుతుంది. గైకొనే ఆత్మలో పారమార్ధిక ధర్మ తేజస్సుని ఆకర్షించే శక్తి సమగ్రమై, బలిష్టమై వుండనప్పుడు, తత్సిధ్ధికి ఆవశ్యమైన తేజస్సును ఇవ్వగల శక్తి సహజంగానే లభించి తీరుతుంది.


(శ్రీ రామకృష్ణ మఠం వారు ప్రచురించిన హిందు మతం –వివేకానంద స్వామి పుస్తకం నుండి...)