Showing posts with label జయంతి. Show all posts
Showing posts with label జయంతి. Show all posts

Tuesday, January 12, 2010

కర్మ సూత్రం –వివేక వాణి




కర్మ సూత్రం విషయంలో హిందువులే కాక బౌధ్ధులు, జైనులు, అందరూ ఏకాభిప్రాయులవుతున్నారు. జీవం నిత్యమని అందరూ అంగీకరిస్తారు. అది శూన్యం నుండి కలిగిందనడం తగదు ; అది అసంభవం. అటువంటి జీవం ఎందుకూ కొరగాదు. ఎందుకంటే, కాలంలో దేనికి మొదలుందో, కాలంలో దానికీ తుదీ వుంటుంది. జీవం నిన్న ప్రారంభమైతే, రేపు అంతరించి తీరాలి! అప్పుడు సర్వనాశనమే ఫలితార్ధం. జీవం శాశ్వతమై వచ్చేదే! దీన్ని గ్రహించడానికి పెద్ద మేధా శక్తి అవసరం లేదు. ఈనాటి ప్రకృతి శాస్త్రాలన్నీ మనకు తోడ్పడుతున్నాయి. అవి మన ధర్మ శాస్త్రాలకు భౌతిక ప్రపంచంలో నిదర్శనాలు చూపుతున్నాయి. మనలో ప్రతి వాని స్థితి అనంతమైన పూర్వ జన్మల ఫలితార్ధమే అని మీకు తెలుసు.

లోకంలో ఒక బిడ్డ పుట్టాడనుకోండి. అతడు ప్రకృతి చేతిలో నుండి తళుక్కుమని తటాలున వూడిపడటం లేదు. కవులు అలా వర్ణించి ఆనందించినా, ఆనందింతురు గాక! కానీ, బిడ్డ నెత్తి మీద అనంతమైన పూర్వ కర్మ భారముంది. మంచో, చెడో తన పూర్వ కర్మలను పరిష్కరించుకునే నిమిత్తమే, అతడీ లోకానికి వస్తున్నాడు. ఇదే కర్మ సూత్రం. మనలోని ప్రతివాడు, తన అదృష్టానికి తానే కర్త అవుతున్నాడు. ఈ సూత్రం ‘ విధి వ్రాత ‘, ‘ దైవ సంకల్పం ‘ అనే వాదాలను ఎగురగోట్టేస్తోంది. ఈ సూత్రమే భగవంతునికీ, మానవునికీ సమాధానం కూర్చడానికి ఆధారమవుతోంది. మన దుఃఖాలకు మనమే బాధ్యులం ; ఇంకెవరూ కారు. కార్య రూప ఫలం మనమే ; కారణమూ మనమే. అందువల్లే, మనం స్వతంత్రులం అనడం.

నేను దుఃఖినైతే, ఆ దుఃఖం నేను తెచ్చి పెట్టుకున్నదే. నేను తలచుకుంటే, సుఖవంతుడనుగా మారగల ననడానికి అదే నిదర్శనం. నేను దుష్టుడనైతే అదీ నా కర్మ ఫలమే. కాబట్టి నేను తలపెడితే పవిత్రుడిని కాగలననడానికి రుజువు కూడా అదే. నరుని ఇచ్ఛా శక్తి పరిస్థితులన్నింటికీ అతీతమై వొప్పుతోంది. దీని ముందు అంటే, నరునిలో వున్న బలిష్టం, మహత్తరం, అఖండం అయిన ఇఛ్ఛాస్వాతంత్ర్యాల ఎదుట, ప్రకృతి కూడా జోహారనవలసిందే ; తల వంచి దాస్యం చేయవలసిందే. కర్మ సూత్రం యొక్క మహిమా ఇలాంటిది సుమండీ!!

(
వివేకానంద- హిందు మతం పుస్తకం నుండి )

(జనవరి పన్నెండు వివేకానంద జయంతి సందర్భంగా....)

Tuesday, December 29, 2009

మహా మౌని, భగవాన్ రమణులు !







ఇరవైశతాబ్దం లో ఇలలో జన్మించిన అవతార పురుషులు, సద్గురువుల్లో అగ్రగణ్యులు భగవాన్ రమణ మహర్షి. ఆయన జీవిత విశేషాల గురించి , ఆయన బోధనల గురించి ప్రత్యేకం గా రాయాల్సిన పని లేదు. శివుడు గరళాన్ని సేవించి గరళకంఠుడైనాడంటే నమ్మశక్యం కాదు మనకు. అది నిరూపించటానికా అన్నట్లు పదహారవ ఏట పూర్వాశ్రమంలో వెంకట్రామన్ నామధేయులైన భగవాన్ మృత్యు అనుభవం పొందారు. ఆ అనుభవం నుండి ఆయన మృత్యుంజయుడైనారు.1907 లో కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని ఆయనను దర్శించి “ రమణ” అని పిలిచారు. అప్పటినుంచి ఆయన రమణ మహర్షి అయ్యారు. రమణ అంటే “ మధుర మూర్తి “ అని అర్ధమట. ఆ పేరు ఆయనకు ఎంత బాగా అమరిందో! గణపతి ముని ఆయనకు రమణ అని నామమిడితే , రమణులు ఆయనను “ నాయనా” అని సంబోధించారు. అప్పటినుంచి కావ్యకంఠ గణపతి ముని ని “నాయన” అని సర్వులూ వ్యవహారంలో ఆత్మీయంగా, ఆప్యాయంగా పిలుచుకునేవారు.


అరుణాచల గుహల్లో నివసించినప్పుడు భగవాన్ కి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కలగకపోవటంతో ఎక్కువ మాట్లాడలేదు. మహర్షి అనంత శక్తివంతమైన మౌనంలోనే ఆశ్చర్యకరంగా భక్తులకు సంశయ నివారణ అయ్యేది. ఆ తర్వాత కూడా భగవాన్ అధిక సమయం మౌనంగా వుంటూ మానవ మాతృడిగా వ్యవహరించారు. ఆయనది మాట్లాడని మామూలు మౌనం కాదు. మహామౌనం. ఆ మహా మౌనమే విస్తారమైన జ్నాన బోధ. రమణుల సమస్త సంభాషణం కూడా “ నిన్ను నీవు తెలుసుకో” తో మొదలై దానితోనే పూర్తవుతుంది. కోతి, కుక్క, నెమలి లాంటి సమస్త జంతుజాలాన్ని మీరు అని గౌరవంగా సంబోధించి ప్రేమించి అందరిపై తమ అనుగ్రహాన్ని ప్రసరింపచేసిన కరుణామూర్తి. కుల, మతాలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు మొదలైన అనవసరమైన వాటిని త్యుజించి నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో తన జీవిత విధానంతో చూపించారు భగవాన్.

“ నిన్ను నీవు తెలుసుకోకుండా, జగత్తును తెలుసుకోవాలనుకుంటే, అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది. నీ మనస్సు యొక్క ఫలితమే, ప్రపంచం. ముందు ఆ మనస్సుని తెలుసుకో. తర్వాత జగత్తును చూడు. అప్పుడు అది ఆత్మ కంటే అన్యంగా, భిన్నంగా , విడిగా లేదని తెలుసుకుంటావు” అంటారు రమణులు.

ఒక భక్తుడు “ ఉద్యోగానికి రాజీనామా చేసి , నిరంతరం భగవాన్ సన్నిధిలో వుండాలనే తలంపు వుంది నాకు “ అని అడిగినప్పుడు భగవాన్ ఇలా సమాధానమిచ్చారు. “ భగవాన్ ఎప్పుడూ మీతోనే, మీలోనే మీరయ్యే వున్నారు. ఈ సత్యా సాక్షాత్కారానికి ఉద్యోగానికి రాజీనామా చేయనవసరం లేదు. ఇంటి నుంచి పలాయనం చేయనవసరం లేదు. పరిత్యాగమంటే వస్త్రాల్ని మార్చడం, కుటుంబ బండాల్ని బహిష్కరించడం, ఇంటిని, ఇల్లాలిని వదలడం కాదు. కానీ, వాటిపై వున్న కోర్కెల్ని,బంధాల్ని, అనుబంధాల్ని విడుచుటే. ఉద్యోగానికి రాజీనామా చేయవలసి పని లేదు. కానీ, ఈ సమస్త భారాల్ని మోసే భగవంతునితో రాజీపడు. అందరి భారాల్ని మోసే వాడు అతనే. కోర్కెల్ని పరిత్యుజించువాడు విశ్వంలో లీనమై, సమస్త ప్రపంచాన్ని ప్రేమించగలుగుతాడు. ప్రేమ, వికాసం, అనురాగం కలిగివుండటం నిజమైన దైవభక్తుని లక్షణాలు. పరిత్యాగం కంటే . ఎందుకంటే, సన్నిహితమైన తన బంధాన్ని, ప్రేమను, జాతి-మాట-కుల పరిమితులను దాటుటే, వాటిని అధిగమించుటే నిజమైన పరిత్యాగం.

సన్యాసి తన వస్త్రాల్ని, ప్రపంచాన్ని, ఇంటిని విసర్జిస్తున్నాడంటే, విరక్తి వల్ల కాదు. అట్లా చేయడం కానీ, తన చుట్టూ వున్న ప్రపంచాన్ని ప్రేమించి, సేవించాలనే కోరికతో అలా పరిత్యాగం చేస్తాడు. ఆ వికాసం కలిగినప్పుడు , తాను ఇంటి నుండి పారిపోతున్నాననే భావన వుండదు. కానీ, అది చెట్టు నుంది రాలిపోయిన పండు వలె సహజంగా జరుగుతుంది. పరిపక్వత రానంత వరకూ ఇల్లు , ఉద్యోగం వదులుట తెలివితక్కువ తనం.” అని ఎంతో సమగ్రంగా, వివరంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లు చెప్పారు భగవాన్.

రమణుల జన్మదినం డిసెంబర్ 30 , 1879.రమణుల జయంతి సందర్భంగా ఆయన బోధనల నుంచి కొన్నింటిని స్మరించి తరిద్దాము.ఆయన బోధనల గురించి తెలుగు లో ప్రత్యేక బ్లాగులే వున్నాయి. వాటిల్లో ఇంకా మంచి సమాచారం లభిస్తుంది. వాటిని ఇక్కడ చూడండి.