Wednesday, January 20, 2010

సూఫీ మహాత్ముడు హజరత్ తాజుద్దీన్ బాబా

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో క్రీ.శ. 1850-1950 ల మధ్య కాలం ఎంతో విశిష్టమైనది. కారణం ఈ మధ్య కాలంలోనే శ్రీ శిరిడీ సాయిబాబా, మరికొందరు మహా సిధ్ధ పురుషులు ఆధ్యాత్మిక పథంలో భౌతికంగా దర్శనమిచ్చారు. ప్రపంచ ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించే ఒక మహాత్ముల చక్రముందని, ఆ చక్రానికి 72 మంది వివిధ మతాలకు చెందిన సిధ్ధ పురుషులు చక్ర పత్రాలైతే, శ్రీ శిరిడి సాయినాధుడు ఇరుసులా వుంటారని- ఒక సాంప్రదాయం. వారిలో శ్రీ శిరిడి సమగ్ర జీవిత చరిత్రను, వారి సమకాలికులైన మరి నలుగురు ప్రసిధ్ధ సిధ్ధ పురుషుల –శ్రీ స్వామి సమర్ధ (అక్కల్కోట), శ్రీ తాజుద్దీన్ బాబా (నాగపూర్), శ్రీ గజానన్ మహారాజ్ (షేగాం), శ్రీ ధునీవాలా దాదా (ఖాండ్వా)-చరిత్రలను ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఆంగ్లం లోనూ, తెలుగులోనూ రచించారు. శ్రీ తాజుద్దీన్ బాబా జయంతి (జనవరి 27) సందర్భంగా శ్రీ భరద్వాజ గారు రాసిన ‘ శ్రీ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర ‘ పుస్తకం నుండి ఈ వ్యాసాన్ని తయారుచేసి ‘ సాయిబాబా’ మాస పత్రిక జనవరి సంచికలో ప్రచురించారు. నాగపూర్ కి చెందిన సూఫీ ఫకీర్ తాజుద్దీన్ బాబా జీవితం గురించి ఈ వ్యాసం ఒక చిన్న పరిచయం.
తాజుద్దీన్ బాబా జననం-సాధన
అది ఆగస్ట్ 17, 1925 వ సంవత్సరం. ఆనాడు జరిగిన రెండు సంఘటనలునాగపూర్ వాసులను ఆవేదనలోనూ ఆశ్చర్యంలోనూ ముంచివేశాయి. హజరత్ తాజుద్దీన్ బాబా ఆ రోజే సమాధి చెందడం వారి ఆవేదనకు కారణమైతే, పండరీ విఠల్, రుక్మాదేవి విగ్రహాలు పన్నెండు గంటల సేపు సంతత ధారగా కన్నీరు కార్చడం వారి ఆశ్చర్యానికి కారణం. విగ్రహారాధనను నిరసించే ముస్లిం మతానికి చెందిన ఫకీర్ హజ్రత్ తాజుద్దీన్ బాబా సమాధి చెండితే హిందు దేవతా విగ్రహాలు దుఃఖించడం విచిత్రం కాదా! దైవం హిందువా? ముస్లిమా ? అసలు ఆయన మతమేది?
ముస్లిముల చేత పీర్ (గురువు ) గా, హిందువుల చేత భగవదవతారంగా కీర్తించబడిన తాజుద్దీన్ బాబా పూర్వీకులు అరబ్బు దేశం వారు. హజరత్ ఇమామ్ ఆస్కార్ అనే ఆయన మనుమదైన సయ్యద్ అబ్దుల్లా అరేబియా దేశం నుండి హిందూ దేశానికి వచ్చి మద్రాస్ లో స్థిరపడ్డారు. చాలా కాలంగా ఆయన సంతతివారంతా మద్రాస్ పరిసర ప్రాంతాలలోనే నివసించేవారు. వారి వంశంలోని వాడే సయ్యద్ బదృద్దీన్. సయ్యద్ బదృద్దీన్ సైన్యంలో చేరి మద్రాస్ ప్లాటూన్ -32 లో సుబేదారు గా వుంటూ కాంప్టి అనే ఊళ్ళో వుండేవాడు. అతను షేక్ మీరాన్ సాహెబ్ గారి కుమార్తె అయిన మీరాన్ బీ ని వివాహం చేసుకున్నాడు.
1861 వ సంవత్సరం జనవరి 27 వ తేదీన గురువారం ఉదయం గం.5-15 నిమిషాలకు మీరాబీ కి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవానికి తాజుద్దీన్ అని పేరు పెట్టారు. అయితే తాజుద్దీన్ అందరి పిల్లల వలె ఏడవలేదు. తల్లితండ్రులు శిశువులో జీవం ఉన్నదో లేదోనని అనుమానించి గాబరా పడి శిశువుకు చైతన్యం కలిగించడం కోసం వారి ఆచారం ప్రాకారం శిశువు కణతల మీద ముఖం మీద కాల్చారు. వెంటనే శిశువు తాను జీవించే వున్నానని తెలుపడానికేమో అన్నట్లు కొద్ది క్షణాలు మాత్రమే రోదించి ఊరుకొని కళ్ళు తెరిచి అన్నీ వైపులకూ చూడదమారంభించాడు. మహాత్ముడైన తాజుద్దీన్ ముఖం మీద ఆనాడు కాల్చిన ముద్రలు శాశ్వతం గా ఉండిపోయాయి.
తాజుద్దీన్ తల్లితండ్రులకు ఆయనను బాబా తాజుద్దీన్ గా చూచే అదృష్టం లేకపోయింది. తాజుద్దీన్ పుట్టి సంవత్సరం తిరుగక ముందే అతని తండ్రి బదురుద్దీన్ చనిపోయాడు. ఆయనకు 9వ సంవత్సరం రాగానే తల్లి గూడ గతించింది. తండ్రి చనిపోయాక తాజుద్దీన్ వారి అమ్మమ్మగారి ఇంటివద్దనే పెరిగాడు. అతని ఆరవ ఏటా స్కూల్లో చేర్పించారు. 6 వ సంవత్సరం నుంచీ 18 వ సంవత్సరం దాకా తాజుద్దీన్ అరబ్బీ, పార్శీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకున్నారు.
ఆశీర్వాదం
తాజుద్దీన్ చదువుకునే బడికి ఒకసారి ఆ ప్రాంతంలో ప్రఖ్యాతి గాంచిన ముస్లిం మహాత్ముడు హజరత్ అబ్దుల్లాషా వచ్చారు. అప్పుడు తాజుద్దీన్ ఒకటో తరగతిలో వున్నాడు. ఆ మహాత్ముడు తాజుద్దీన్ వైపు దృష్టి నిగిడ్చి చూచి సంచీలో నుండీ కొంత మిఠాయిని తీసి కొంచెం చప్పరించి తాజుద్దీన్ నోట్లో వేశారు. తరువాత ఆ ముస్లీమ్ ఫకీర్ ఉపాధ్యాయులతో తాజుద్దీన్ చూపుతూ “ ఇతనికి మీరేం బోధించగలరు. ఇతని విద్యాభ్యాసం ఇదివరకే పూర్తయింది.” అన్నారు. “ మితంగా తిను, మితంగా మాట్లాడు, ఖురాన్ చదివేటప్పుడు మహమ్మదుల వారే నిన్నావేశించనట్లు భావయుక్తంగా పఠించు: అని తాజుద్దీన్ తో చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు.
హజరత్ అబ్దుల్లా షా ఆశీర్వదించి వెళ్ళాక తాజుద్దీన్ లో వింతైన మార్పు వచ్చింది ఏదో పారవశ్యం అతనిని ముంచివేసింది. మూడు రోజుల పాటు ఆగకుండా అతని కళ్ళ వెంట సంతత ధారగా ఆనంద భాష్పాలు కారాయి. ఆ తర్వాత తాజుద్దీన్ కు ఆట పాటల యందు ఆసక్తి తగ్గింది. ఎప్పుడూ ఒంటరిగా గడిపే తాజుద్దీన్ పుస్తకాలు చదివి అర్ధం చేసుకునే జ్నానమ్ కాలిగాక గొప్ప గొప్ప సూఫీ మహాత్ములు రచించిన గ్రంధాలను చదువుతూ క్రమం గా అధ్భూతమైన వారి జీవిత విధానాల వైపుకు ఆకర్షితుడైనాడు.
అతను చదివిన వాటన్నింటిలోకి ఒక గొప్ప ముస్లిం మహాత్ముడు చెప్పిన ద్విపద ముస్లిం తాజుద్దెన్ హృదయాన్ని ఆకట్టుకోండి. దాని భావమేమిటంటే.....
“ సారాయి త్రాగు!
ఖురాన్, కాబాలను తగులబెట్టు!
కావాలంటే దేవాలయాల్లో నివసించు!...కానీ,….
ఏ మానవుని హృదయాన్ని ఎన్నడూ గాయపరచకూ!!”
గొప్ప మహాత్ముడైన హజరత్ అబ్దుల్లా షా ఈ ద్విపదను కేవలం సాహిత్య పరమైన అర్ధం తో చెప్పారనుకోవటం సరికాదనిపిస్తుంది. సూఫీ మహాత్ములు వ్రాసే అటువంటి ద్విపదలు భావగర్భితమైన పరిభాషలో వుంటాయి. ఆ పదాలలో పైకి ప్రకటమయ్యే అర్ధం గాక లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ఇమిడి వుంటాయి. సామాన్యంగా వారు ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పేటప్పుడు ప్రేమ, త్రాగుడు, మైకం లాంటి పదాలను వాడుతూ వుంటారు. పైన చెప్పిన ద్విపద లో ‘ సారాయం త్రాగు ‘ అంటే భగవంతునిపై భక్తితో పారవశ్యం చెందు అని భావం. ఖురాన్ అంటే కేవలం కొన్ని కాగితాలు, వాటిపై ముద్రించబద్ద రంగు సిరా మాత్రమే కాదని, పవిత్రమైన కాబా అంటే కేవలం ఒక నల్లని రాతి ముక్క మాత్రమే కాదని, అవి రెండూ కేవలం నామరూప సహితమైన వస్తువులనే భావాన్ని వదిలి వాటికాధారంగా , అతీతంగా వున్న శాశ్వతానందాన్ని పొందడమే –ఖురాన్, కాబాలను తగులబెట్టటమంటే! దేవాలయాల్లో నివసించడమంటే ఎవరి మత ధర్మాలను వారినాచరించుకోనీమని, ఎవరి నమ్మకాలనూ, ఆచారాలనూ వారిని పాటించుకోనీమనీ భావం. అయితే ఈ మూడు ఆచరించినా, ఆచరించకపోయినా, ఇతరుల హృదయాన్ని ఎన్నడూ గాయపరచకూడదనే ఉత్తమ ధర్మాన్ని పాటించమని ఆఖరి పాదం లోని భావం. తాజుద్దీన్ బాబా జీవిత చరిత్ర అంతా ఆయన హృదయాన్ని ఆకట్టుకున్న ఈ సత్యాలను గూర్చిన మౌన వ్యాఖ్య.
తాజుద్దీన్ 18 వ ఏట కాంప్టి దగ్గరగా వున్న కమ్మాన్ అనే నదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ వరదలకు అపారమైన జన నష్టం, ఆస్తుల నష్టం జరిగింది. ఎంతో మందికి నిలువ నీడ, తినటానికి తిండీ లేకుండా పోయింది. వరద బాధితుల కష్టాలను చూచి తాజుద్దీన్ హృదయం చలించింది. తల్లితండ్రులు పోయాక తాజుద్దీన్ కి ఆశ్రయమిచ్చినా మేనమామ హజరత్ అబ్దుల్లా రహమాన్ గారి ఇల్లు కూడా కూలిపోయి, ఆయనకూ ఎంతో నష్టం వచ్చింది. ఇల్లు గడవడం కోసం ఆయన అటవీ శాఖలో పని చేయవలసి వచ్చింది. ఆయనే సైన్యంలో చేరమని సలహా ఇవ్వటంతో తాజుద్దీన్ తన 20 వ ఏట 1881 వ సంవత్సరంలో 13 వ నాగపూర్ రెజిమెంట్ లో చేరాడు. సైన్యంలో వుండగా తాజుద్దీన్ ఉద్యోగ నిర్వహణలో దేశం నలుమూలలా తిరిగాడు. ఫ్రాన్స్ మొదలైన విదేశాలలో కూడా ఆయన పర్యటించారు. విదేశాల నుండి వచ్చాక వారి రెజిమెంట్ హైదరాబాద్ లో గ్రాస్ ఫారం అనేచోట స్థావరమేర్పర్చుకుంది. అక్కడ వుండగానే ‘ బెంజ్ ‘ అనే అమెరికన్ అధికారి తాజుద్దీన్ తో పరిచయం ఏర్పర్చుకొని ఆయన వద్ద ఖురాన్ అంతా నేర్చుకున్నాడు. విలియమ్స్ అనే ఆయన కూడా తాజుద్దీన్ కు సన్నిహితుడై ఆధ్యాత్మికంగా పురోగతి పొందాడు. తర్వాత విలియమ్స్ కలకత్తా వెళ్ళాడు. అక్కడ బంగ్ మేరీ అనే చోట విలియమ్స్ సమాధిని మనం నేటికీ చూడవచ్చు.
1884 వ సంవత్సరంలో తాజుద్దీన్ సైనిక దళం సాగర్ అనేచోటికి చేరింది. సైన్యంలో పని చేసే రోజుల్లో కూడా తాజుద్దీన్ నమాజ్ చేయడంలో ఎప్పుడూ ఆశ్రధ్ధ చూపలేదు. సౌగర్ లో వుండేటప్పుడే ఒక రోజున తాజుద్దీన్ కు అతి మధురమైన గానం వినిపించింది. ఆ గానం చేస్తున్న వారెవరో వెతుక్కుంటూ బయల్దేరి ఊరూ బయట నివసిస్తున్న హజరత్ దావూద్ షా చిస్తీ అనే ముస్లిం మాహాత్ముని నివాసం చేరాడు. అది మొదలు ప్రతి రోజు తన ఉద్యోగ ధర్మం ముగిశాక తాజుద్దీన్ ఆ మహాత్ముని సాంగత్యంలో గడిపేవాడు.
ఆయన సన్నిధిలో ఎంతో సేపు ధ్యానం చేసేవాడు. తరచుగా రాత్రంతా అక్కడే గడిపి తెల్లవారాక శిబిరానికి వెళ్ళేవాడు. తాజుద్దీన్ రాత్రిళ్లు తరచుగా ఎటో వెళ్తున్నాడని కాంప్టి లో వుండే ఆయన బామ్మ గారికి తెలిసింది. తాజుద్దీన్ చెడు సావాసాలు చేస్తున్నాడేమోనని తలచిన ఆమె మనవణ్ణి మందలించడానికి సౌగర్ వచ్చి రహస్యంగా ఒకరోజు రాత్రి తాజుద్దీన్ ను వెంబడించింది. తాజుద్దీన్ నేరుగా ముస్లిం మహాత్ముని వద్దకు వెళ్ళి దైవ ధ్యానం చేసుకుంటూ వుండటం చూసి సంతోషంగా తిరిగి వచ్చింది. మరునాడు ఉదయమే తిరిగి వచ్చిన తాజుద్దీన్ కి ప్రేమతో ఫలహారం అందించింది బామ్మగారు. కానీ తాజుద్దీన్ వాటిని తినక తన చేతిలో వున్న రెండు రాళ్ళను బామ్మ గారికి చూపిస్తూ “ ఇవిగో నా దగ్గర లడ్డూ, జిలేబీ వున్నాయి.” అంటూ వాటిని నోట్లో వేసుకొని చప్పరిస్తూ తినేశాడు. తాజుద్దీన్ చేసిన ఈ పని బామ్మగారిని ఆశ్చర్యంలో ముంచేసింది. దైవ చింతనలో ఎక్కువ సమయం గడపడం వల్ల తాజుద్దీన్ లో అతీత శక్తులు మేల్కొన్నాయని గుర్తించిన బామ్మగారు మనుమడు ఏ దుష్ట సాంగత్యాన్నికి లోనూ కాలేదని సంతోషిస్తూ తిరిగి కాంప్టి చేరింది. హజరత్ దావూద్ చిస్తీ కొద్దికాలం తర్వాత మరణించారు. ఆ తర్వాత కూడా తాజుద్దీన్ ఆయన సమాధి వద్ద ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించారు.
ఆయన చేసిన అసంఖ్యాకమైన లీలలు, బోధలు ఆయన దివ్య చరిత్ర లో వివరం గా చదవవచ్చు.
----శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర నుండి...
రచన : శ్రీ ఎక్కిరాల భరద్వాజ
పుస్తకాలు దొరుకు చోటు...
శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్, ఎం.ఎం.డొంక, ఒంగోలు -523002,
ఫోన్ నెంబర్ 08592-233271

Tuesday, January 12, 2010

కర్మ సూత్రం –వివేక వాణి




కర్మ సూత్రం విషయంలో హిందువులే కాక బౌధ్ధులు, జైనులు, అందరూ ఏకాభిప్రాయులవుతున్నారు. జీవం నిత్యమని అందరూ అంగీకరిస్తారు. అది శూన్యం నుండి కలిగిందనడం తగదు ; అది అసంభవం. అటువంటి జీవం ఎందుకూ కొరగాదు. ఎందుకంటే, కాలంలో దేనికి మొదలుందో, కాలంలో దానికీ తుదీ వుంటుంది. జీవం నిన్న ప్రారంభమైతే, రేపు అంతరించి తీరాలి! అప్పుడు సర్వనాశనమే ఫలితార్ధం. జీవం శాశ్వతమై వచ్చేదే! దీన్ని గ్రహించడానికి పెద్ద మేధా శక్తి అవసరం లేదు. ఈనాటి ప్రకృతి శాస్త్రాలన్నీ మనకు తోడ్పడుతున్నాయి. అవి మన ధర్మ శాస్త్రాలకు భౌతిక ప్రపంచంలో నిదర్శనాలు చూపుతున్నాయి. మనలో ప్రతి వాని స్థితి అనంతమైన పూర్వ జన్మల ఫలితార్ధమే అని మీకు తెలుసు.

లోకంలో ఒక బిడ్డ పుట్టాడనుకోండి. అతడు ప్రకృతి చేతిలో నుండి తళుక్కుమని తటాలున వూడిపడటం లేదు. కవులు అలా వర్ణించి ఆనందించినా, ఆనందింతురు గాక! కానీ, బిడ్డ నెత్తి మీద అనంతమైన పూర్వ కర్మ భారముంది. మంచో, చెడో తన పూర్వ కర్మలను పరిష్కరించుకునే నిమిత్తమే, అతడీ లోకానికి వస్తున్నాడు. ఇదే కర్మ సూత్రం. మనలోని ప్రతివాడు, తన అదృష్టానికి తానే కర్త అవుతున్నాడు. ఈ సూత్రం ‘ విధి వ్రాత ‘, ‘ దైవ సంకల్పం ‘ అనే వాదాలను ఎగురగోట్టేస్తోంది. ఈ సూత్రమే భగవంతునికీ, మానవునికీ సమాధానం కూర్చడానికి ఆధారమవుతోంది. మన దుఃఖాలకు మనమే బాధ్యులం ; ఇంకెవరూ కారు. కార్య రూప ఫలం మనమే ; కారణమూ మనమే. అందువల్లే, మనం స్వతంత్రులం అనడం.

నేను దుఃఖినైతే, ఆ దుఃఖం నేను తెచ్చి పెట్టుకున్నదే. నేను తలచుకుంటే, సుఖవంతుడనుగా మారగల ననడానికి అదే నిదర్శనం. నేను దుష్టుడనైతే అదీ నా కర్మ ఫలమే. కాబట్టి నేను తలపెడితే పవిత్రుడిని కాగలననడానికి రుజువు కూడా అదే. నరుని ఇచ్ఛా శక్తి పరిస్థితులన్నింటికీ అతీతమై వొప్పుతోంది. దీని ముందు అంటే, నరునిలో వున్న బలిష్టం, మహత్తరం, అఖండం అయిన ఇఛ్ఛాస్వాతంత్ర్యాల ఎదుట, ప్రకృతి కూడా జోహారనవలసిందే ; తల వంచి దాస్యం చేయవలసిందే. కర్మ సూత్రం యొక్క మహిమా ఇలాంటిది సుమండీ!!

(
వివేకానంద- హిందు మతం పుస్తకం నుండి )

(జనవరి పన్నెండు వివేకానంద జయంతి సందర్భంగా....)

Sunday, January 3, 2010

ఆత్మ ప్రబోధం మరొక ఆత్మ నుంచే రావాలి!



గురువు గురించి వివేకానందుడి పలుకులు

ప్రతి ఆత్మకూ పరిపూర్ణత పొందటమే విధాయకం. ప్రతి ప్రాణీ చివరకు పరిపూర్ణత పొందే తీరుతుంది. మన ప్రస్తుత స్థితి మన గత జన్మ కర్మల భావాల ఫలం. మన భవిష్యత్ స్థితి మన ఇప్పటి కర్మల, భావాల ఫలమై వుంటుంది. అంటే మన అదృష్టానికి మనమే కర్తలం. అయినా మన అదృష్ట నిర్మాణ కార్యంలో మనం ఇతరుల సహాయం పొందరాదనే నిషేధం ఏమీ లేదు. ఏ కొద్ది మందికో తప్ప ఇలాంటి సహాయం జన సామాన్యమందరికీ అత్యంత ముఖ్యం కూడా. అలాంటి సహాయం లభించినప్పుడు ఆత్మ లో ప్రచ్ఛన్న రూపంలో వుండే మహోత్కృష్ట శక్తులు సచేతనలవుతవి, పారమార్ధిక జీవనం మేలుకాంచుతుంది, అభివృధ్ధి విజృంభిస్తుంది. మానవుడు చివరకు పావనత్వాన్ని, పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. ఈ వుజ్జీవన శక్తి గ్రంధాల నుంచి రాదు. ఆత్మకూ ఈ శక్తి మరొక ఆత్మ నుంచే లభించాలి గాని, మరెక్కడి నుంచీ లభించదు.. జీవిత కాలమంతా మనం గ్రంధావలోకన మగ్నులమై వుండవచ్చు. మనం అత్యంత బుధ్ధి పరిణితిని ఆర్జించవచ్చు. కానీ చివరకు మనకు పారమార్ధికాభివృధ్ధి లేశమైనా ప్రాప్తించి వుండదు. మహోన్నత బుధ్ధి పరిపాకం సాధించిన మానవుడి తదనురూపమైన పారమార్ధిక పరిపాకం కూడా అలవడే వుంటుందనటం అసత్యం. గ్రంధ పఠనం చేసేటప్పుడు మనకు అందుచేత పారమార్ధిక లాభం కూడా ప్రాప్తిస్తుందని మనం ఒక్కోసారి భ్రమ పడవచ్చు.కానీ పుస్తక పఠన ఫలాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే , బుధ్ధికి ఒకవేళ బలం చేకూరి వుండవచ్చు గాని, ఆత్మ ప్రబోధం ఏమీ కలుగలేదని స్పష్టపడుతుంది. పారమార్ధిక విషయాలను గురించి మనం అందరం అత్యధ్భుతోపన్యాసాలు ఇవ్వగలిగి వుండీ , యధార్ధమైన పారమార్ధిక జీవనం గడపటంలో కేవలం కుంటుపడి వుండటానికి కారణం ఇదే. పుస్తక పఠనం పారమార్ధిక ఉద్దీపనం కలిగించే విషయంలో కేవలం అసమర్ధం అవటమే. ఆత్మ ప్రబోధం మరొక ఆత్మ నుంచే రావాలి. ఈ ప్రబోధం ఎవరి ఆత్మ నుంచి వస్తుందో, ఆ వ్యక్తిని గురువు అంటారు. అది ఎవరి ఆత్మకు ప్రసాదించబడుతుందో, ఆ వ్యక్తిని శిష్యుడంటారు. ఈ పారమార్ధిక శక్తి ఒకరి నుంచి మరొకరికి లభించాలంటే, అది వెలువడే ఆత్మ కు ప్రసాద సమర్ధతా, గైకొనే ఆత్మకూ ప్రతి గ్రహణార్హతా వుండటం అత్యావశ్యకం. విత్తనం ప్రాణవంతమై వుండాలి; చేను దున్ని చల్లటానికి సిధ్ధపరిచి వుండాలి. ఈ రెండూ సమకూడితే, యధార్ధమైన పారమార్ధిక సస్యాభివృధ్ధి అత్యధ్భుత రూపంలో వెలువడుతుంది. నిజమైన మతబోధకుడు అత్యధ్భుత ప్రతిభావంతుడై వుండాలి. శ్రోత కూడా బుధ్ధి కుశలుడై వుండాలి. “ ఆశ్చర్యోవాక్తా కుశలోస్య లబ్ధా” ఇద్దరూ ఆశ్చర్యమైన వారు గానూ, అసాధారణమైన వారుగాను వుంటే తత్ఫలంగా మహోత్కృష్ట పారమార్ధిక ఉజ్జీవనం కలుగుతుంది. కాకుంటే అలాంటిది కలగటం అసాధ్యం. అలాంటివారే నిజమైన గురువులు, అలాంటి వారే నిజమైన శిష్యులూ, సాధకులూ. తక్కిన వారు చేసేది పారమార్ధిక భావాలతో చెరలాటాలు ఆడటమే. వారికదొక వినోద క్రీడామాత్రం. అదేమిటో కాస్త తొంగి చూస్తామనే కుతూహలం, ఒకింత బుధ్ధిగ్రాహ్యం చేసికొందామనే కోరిక, వారికి కలిగింది. అంతే. పారమార్ధిక జీవన క్షేత్రపు వెలుపటి పొలిమేర చిట్టచివర వారు నిలబడి వున్నారు. కానీ, దీన్లో గూడ కొంత గుణం వుంది నిజమే. కాలక్రమాన దాని నుంచే పారమార్ధిక జ్నాన తృష్ణ ఉదయించవచ్చు. అతి నిగూఢమైన ప్రకృతి ధర్మం ఒకటి వుంది – క్షేత్రం సంసిధ్ధమవటంతోనే బీజం ప్రాప్తించాలి. ప్రాప్తించి తీరుతుంది. ఆత్మకూ పారమార్ధిక ధర్మతృష్ణ తీవ్రం గా కలిగాక దానికి ఆ తృష్ణ ను తీర్చే పారమార్ధిక శక్తి ప్రాప్తించాలి. ప్రాప్తించి తీరుతుంది. గైకొనే ఆత్మలో పారమార్ధిక ధర్మ తేజస్సుని ఆకర్షించే శక్తి సమగ్రమై, బలిష్టమై వుండనప్పుడు, తత్సిధ్ధికి ఆవశ్యమైన తేజస్సును ఇవ్వగల శక్తి సహజంగానే లభించి తీరుతుంది.


(శ్రీ రామకృష్ణ మఠం వారు ప్రచురించిన హిందు మతం –వివేకానంద స్వామి పుస్తకం నుండి...)